ఎయిర్‌పోర్ట్‌లో బిడ్డను మరచిన తల్లి!

12 Mar, 2019 12:00 IST|Sakshi

మార్గమధ్యంలో గుర్తించడంతో విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్

రియాధ్‌ : మాములుగా ప్రయాణమంటేనే చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది విమాన ప్రయాణమంటే మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఇక వస్తువుల విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్‌చేసుకోని మరి ఫ్లైట్‌ ఎక్కుతాం. ఏ వస్తువు మరిచిపోయినా అత్యవసరమైతే తప్పా.. ఫ్లైట్‌ను వెనక్కి రప్పించలేం. అయితే, ఓ తల్లి మాత్రం ఏకంగా తన కన్న బిడ్డనే మర్చిపోయి విమానమెక్కేసింది. అంతేకాకుండా తీరా మార్గమధ్యంలో తన బిడ్డను మరిచాననే విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని బోరుమంది. వెయింటిగ్ హాల్‌లోనే తన నవజాత శిశువును వదిలేసి విమానం ఎక్కానని విమాన సిబ్బందికి చెప్పడంతో వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ (ఏటీసీ)కి సమాచారం అందించి ఫ్లైట్‌ను వెనక్కి తిప్పారు. పైలట్ చెప్పిన విషయం విన్న ఏటీసీ అధికారులు ఆశ్చర్యపోయారు.

అనంతరం మానవతా దృక్పథంతో విమానం వెనక్కి రావడానికి అనుమతిని ఇచ్చారు. విమానం ల్యాండయ్యాక ఎయిర్‌పోర్టు సిబ్బంది శిశువును ఆమె తల్లికి అప్పగించడంతో  ఈ కథ సుఖాంతమైంది. సినిమాటిక్‌ తరహాలో జరిగిన ఈ ఘటన సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. జెడ్డా నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏటీసీతో పైలట్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వీడియోలో.. విమానంలోని ఓ ప్రయాణీకురాలు తన నవజాత శిశువును ఎయిర్‌పోర్ట్‌లోని వెయిటింగ్‌ హాల్‌లో మరిచిపోయిందని వెనక్కి రావాడానికి అనుమతినివ్వండని ఫ్లైట్‌ సిబ్బంది ఏటీసీని కోరగా... చాలా ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి కేసు ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదని ఏటీసీ అధికారులు సంభాషించినట్లు  ఉంది. సొంతబిడ్డను మరిచి విమానమెక్కిన నీకు దండం తల్లే! అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు