అమెరికా అధ్యక్షుడిపై పెలోసి సంచలన వ్యాఖ్యలు

21 May, 2020 12:22 IST|Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, స్పీకర్‌ నాన్సీ పెలోసిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్రంప్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు పెలోసి. ట్రంప్‌ తన షూస్‌కు కుక్కల విసర్జన పూసుకుని తిరిగేవాడంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. కొద్ది రోజుల క్రితం ట్రంప్‌ ఎమ్‌ఎస్‌ఎన్‌బీసీ టెలివిజన్‌ హోస్ట్‌ జియో స్కార్‌బరో గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతడిని సైకో అంటూ ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేశారు. దీని గురించి మీడియా ప్రతినిధిలు పెలోసిని ప్రశ్నించగా.. ‘అధ్యక్షుడు.. షూస్‌కు కుక్క విసర్జన పూసుకుని తిరిగే పిల్లాడిలాంటి వారు అంటూ మండిపడ్డారు. తనతో పాటు పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ దీన్ని పూస్తాడని అన్నారు. ఆ కుక్క విసర్జనను ఒకసారి పూసుకుంటే  అది చాలా కాలం పాటు అలానే ఉంటుంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పెలోసి. (ట్రంప్‌ - పెలోసీల మధ్య వార్ షురూ..!)

అధ్యక్షుని తర్వాత హోదాలో ఉపాధ్యక్షుని తర్వాతి స్థానంలో ఉన్న నాన్సీ పెలోసి డెమొక్రాటిక్ పార్టీకి చెందినవారు. ఆమెకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అస్సలు పడటంలేదు. గత ఏడు నెలలుగా ఇద్దరూ కనీసం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. కానీ మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. వైద్యశాస్త్రపరంగా రుజువుకాని హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించిన తర్వాత పెలోసి ఆయన ఊబకాయాన్ని ఎత్తిచూపారు. తానైతే అధ్యక్షునికి అలాంటి మందులు సూచించనని అన్నారు. దీనిపై ట్రంప్ తనదైన శైలిలో వ్యక్తిగత విమర్శలకు దిగారు. ‘పెలోసి ఒక రోగిష్టి మహిళ అని.. ఆమెకు చాలా సమస్యలు ఉన్నాయి.. పలు మానసిక సమస్యలతో ఆమె బాధపడుతున్నారు’ అంటూ విమర్శించారు. ఈ క్రమంలో ప్రస్తుతం పెలోసి వ్యాఖ్యలపై ట్రంప్‌ ఎలా స్పందిస్తారో.. ఈ మాటల యుద్ధం ఎక్కడి దాకా తీసుకెళ్తుందో చూడాలి.(రోజూ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ తీసుకుంటున్నా: ట్రంప్‌)

మరిన్ని వార్తలు