కశ్మీర్‌ మా రక్తంలోనే ఉంది

8 Oct, 2019 15:25 IST|Sakshi

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ తమ రక్తంలోనే ఉందని, కశ్మీరీల కోసం పాకిస్తాన్‌ ప్రజలు నిలబడతారని పాక్‌ మాజీ పాలకుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అన్నారు. పాక్‌ శాంతి మంత్రాన్ని జపిస్తున్నా భారత్‌ భయపెట్టాలని చూస్తోందన్నారు. ‘భారత్‌ కార్గిల్‌ యుద్ధాన్ని మరచిపోయిందేమో.. యుద్ధం ముగిసే ముందు అమెరికా సాయం కోరింది’ అని వ్యాఖ్యానించారు. అనారోగ్యంతో దుబాయ్‌లో చికిత్స పొందుతున్న ఆయన మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఆల్‌ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(ఏపీఎంఎల్‌) అధ్యక్షుడిగా ఉన్న 76 ఏళ్ల ముషారఫ్‌ ఆయన అనారోగ్యంతో ఏడాది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌ ప్రత్కేక ప్రతిపత్తిని భారత్‌ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత తొలిసారి ఆయన స్సందించారు. కశ్మీర్‌ పౌరులకు అండగా ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ శాంతి కోరుకుంటోందని, దాన్ని తమ బలహీనతగా భావించొద్దని హెచ్చరించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని పాకిస్తాన్‌ మీడియా వెల్లడించింది. 1999 నుంచి 2008 వరకు పాక్‌ అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్‌.. బెనజీర్‌ భుట్టో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు