వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో తీసిన ఫొటోలను కావాలనే ఎడిట్ చేశానని అమెరికా ప్రభుత్వ ఫొటోగ్రాఫర్ తెలిపారు. 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేషనల్ పార్క్ సర్వీస్లో జనవరి 20, 2017న భారీ సభను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను చూసిన ట్రంప్, తనను పిలిచి ఒబామా సమావేశం ఫొటోల కంటే తన సమావేశంలో ప్రజలు తక్కువగా ఉన్నట్లు కనిపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారని సదరు ఫొటోగ్రాఫర్ విచారణలో పేర్కొన్నారు. ట్రంప్ సూచనమేరకే.. ఖాళీగా ఉన్న ప్రదేశం కనపడకుండా, సభా ప్రాంగణమంతా జనాలతో నిండి ఉన్నట్లుగా ఫొటోలను తానే క్రాప్ చేశానని ఆయన పేర్కొన్నారు.
కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అధిక సంఖ్యలో ప్రజలు రోడ్లమీదకి వచ్చి నిరసన తెలిపిన విషయం తెలిపిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి హోదాలో ట్రంప్ ఏర్పాటు చేసిన మొదటి సమావేశానికి భారీగా ప్రజలు హాజరయ్యారని, ఆయనపై ఎటువంటి వ్యతిరేకత లేదంటూ.. ట్రంప్ మాజీ పత్రికా కార్యదర్శి సమావేశానికి సంబంధించిన ఫొటోలను సాక్ష్యంగా చూపారు. ఈ క్రమంలో అవన్నీ ఎడిటెడ్ ఫొటోలంటూ విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ విమర్శలు నిజమేనని ఫొటోగ్రాఫర్ మాటల ద్వారా నిరూపితమైంది.