ఒక్క సిగరెట్‌.. 51 మందిని బలి తీసుకుంది

28 Jan, 2019 13:08 IST|Sakshi

కఠ్మాండు : గతేడాది మార్చిలో నేపాల్‌ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంలో 51 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. విమానం నడుపుతున్న పైలెట్‌ కాక్‌పిట్‌లో సిగరెట్‌ తాగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు విచారణలో తేల్చారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. దీంతో అధికారులు దర్యాప్తు కోసం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ప్యానెల్‌.. కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ను పరిశీలించింది.

విమానం నడుపుతున్న సమయంలో పైలట్‌ నిబంధనలకు విరుద్ధంగా కాక్‌పిట్‌లోనే పొగ తాగినట్లు అధికారులు గుర్తించారు. కాక్‌పిట్‌లోని సిబ్బంది నిర్లక్ష్యం, ల్యాండింగ్‌ సమయంలో పరిస్థితిపై అవగాహన కోల్పోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. గతేడాది మార్చిలో యూఎస్‌–బంగ్లా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బాంబార్డియర్‌ డాష్‌ 8 క్యూ 400 విమానం 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నుంచి కఠ్మాండుకు బయల్దేరింది.

నేపాల్‌ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో కఠ్మాండు ఎయిర్‌పోర్టులో దిగుతుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 51 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 67మంది ఉన్నారు.

మరిన్ని వార్తలు