పైలట్ల సమ్మె : అన్ని విమానాలు రద్దు

9 Sep, 2019 12:56 IST|Sakshi

చెల్లింపు వివాదం, పైలట్ల మెరుపు సమ్మె

నిలిచి పోయిన బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు 

లండన్‌ : బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌ కు భారీ షాక్‌ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా  సంస‍్థకు చెందిన సుమారు నాలుగువేల మంది పైలెట్లు ఉన్నపళంగా సంచలన నిర్ణయం తీసుకోవడంతో భారీ ఇబ్బందుల్లో పడింది.  వేతన సవరణకుసంబంధించిన నూతన పారిశ్రామిక విధానాన్ని నిరసిస్తూ బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా  విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. దాదాపు అన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదని  బ్రిటిష్ ఎయిర్‌వేస్ (బిఎ) సోమవారం (సెప్టెంబర్ 9) ఒక ప్రటనలో తెలిపింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని అర్థం చేసుకోగలమని, క్షమించమని వారికి విజ్ఞప్తి చేసింది. 

నూతన పారిశ్రామిక విధానాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ (బాల్పా) గత నెలలో సమ్మె నోటీసులిచ్చింది. అయినా సంస్థ ముందుకు రాకపోవడంతో సిబ్బంది మొత్తం సమ్మెకు దిగారు.  బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ చరిత్రలో పైలట్ల మొట్టమొదటి సమ్మె ఇదే. మరోవైపు ఈ నిర్ణయంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.  వీలైనత త్వరలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.  సెప్టెంబర్ 9, 10 తేదీలలో సమ్మె తరువాత, సెప్టెంబర్ 27న  మరో  సమ్మె నిర్వహించనున్నారని సమాచారం.  

కాగా బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌  లాభాలను ఉద్యోగులకు పంచాలని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. జూలైలో విమానయాన సంస్థ ప్రతిపాదించిన మూడేళ్లలో 11.5 శాతం వేతన పెంపును బాల్పా తిరస్కరించింది. ఈ సమ్మె ఈ వివాదాన్ని పరిష్కరించడానికి అవసరమైన పెట్టుబడి కంటే  సమ్మె మూలంగా కంపెనీకి చాలా  నష్టం వస్తుందని  బాల్పా ప్రధాన కార్యదర్శి బ్రియాన్ స్ట్రట్టన్  ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఉద్యోగుల సమ్మె న్యాయబద్దం కాదని, తాము సరైన ప్రతిపాదనలే చేశామని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ చెబుతోంది. 90 శాతం విమానయాన కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో రెండు యూనియన్లు 11.5 శాతం పెంపును అంగీకరించాయని కంపెనీ వాదిస్తోంది.  ఫైనాన్షియల్ టైమ్స్ సాధారణంగా 48 గంటల వ్యవధిలో 1,700 విమానాలను నడుపుతుంది బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌. 

మరిన్ని వార్తలు