లవర్‌ మీద కోపం ఉంటే ఇలా చేస్తారా?

16 Jun, 2020 11:46 IST|Sakshi

బీజింగ్‌ : విమానంలో ప్రయాణిస్తున్న 29 ఏళ్ల మహిళ మద్యం మత్తులో విమానం కిటికీని పగలకొట్టడంతో పైలట్‌ అత్యవసరంగా విమానం ల్యాండ్‌ చేసిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వారం కిందట చోటుచోసుకోగా తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. లూంగ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ 8528 నార్త్‌ వెస్ట్రన్‌ చైనా ప్రావిన్స్‌లోని జీనింగ్‌ నుంచి ఈస్ట్‌ చైనాలోని యాన్‌చెంగ్‌కు బయలుదేరింది. చైనాకు చెందిన ఎంఎస్‌ లీ  పూటుగా మద్యం తాగి విమానంలో ఎక్కి కూర్చుంది. కొద్దిసేపటి తరువాత పక్కనే ఉన్న కిటికీపై అదే పనిగా పంచ్‌ల వర్షం కురిపించింది.

దీంతో అక్కడున్న తోటి ప్రయాణికులు ఆమెను వారించేందుకు యత్నించగా వారిని నెట్టివేస్తూ మరీ కిటికీ అద్దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించింది. విమానంలో ఉన్న సిబ్బంది ఆమెను సీటు నుంచి బలవంతంగా లేపడానికి యత్నించడం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. ఈ విషయం పైలట్‌కు చేరవేయడంతో అతను ఉన్నపళంగా సెంట్రల్‌ చైనా ఫ్రావిన్సులోని జిన్‌జెంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండిగ్‌ చేశాడు.సిబ్బంది సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్నఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఎంఎస్‌ లీని జెంజోహు పోలీసులకు అప్పగించారు.(కరోనా: మగవాళ్లలోనే ఎందుకు మరణాలు ఎక్కువ?)

తన బాయ్‌ఫ్రెండ్‌ మీద ఉన్న కోపంతో విమానంలోని కిటికీని బద్దలు కొట్టడానికి ప్రయత్నించిందని పోలీసులు పేర్కొన్నారు. విమానం ఎక్కడానికి ముందే బోర్డింగ్‌ సమయంలో 250 మి.లీ కలిగిన రెండు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసిందని తెలిపారు. చైనీస్‌ గ్రేయిన్‌ ఆల్కాహాల్‌ అయిన బైజీహులో 35-60 శాతం మద్యం ఉంటుంది. లవర్‌ తనను మోసం చేశాడనే అసహనంతోనే లీ కిటికీని పగలగొట్టడానికి యత్నించిందని పేర్కొన్నారు. పబ్లిక్‌ ప్లేస్‌లో ఇష్యూ చేసిన కారణంతో లీపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆమెను ఎంతకాలం రిమాండ్‌లో ఉంచాలి, విమానానికి జరిగిన నష్టానికి జరిమానా విధించాలా వద్దా అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లీ చేసిన తప్పుకు చైనా సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు ఆమె పాస్‌పోర్టును రద్దు చేసి బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చే అంశంపై కూడా ఎలాంటి స్పష్టత రాలేదు.(24 గంటల్లో 10,667 కేసులు.. 380 మరణాలు)

>
మరిన్ని వార్తలు