మృత్యువు అంచులను చూశారు

14 Jan, 2018 16:40 IST|Sakshi

అంకారా(టర్కీ) : టర్కీకి చెందిన పెగాసస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ఆదివారం పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పి రన్‌ వేపై నుంచి పక్కకు వెళ్లినట్లు టర్కీ మీడియా పేర్కొంది. టర్కీ రాజధాని అంకారా నుంచి ట్రబ్‌జాన్‌ పట్టణానికి 162 మంది ప్రయాణీకులతో విమానం బయల్దేరినట్లు చెప్పింది.

ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పిన విమానం.. కొంచెం ఉంటే సముద్రంలోకి దూసుకెళ్లేదని తెలిపింది. సముద్రానికి కొద్ది మీటర్ల దూరంలో విమానం ఆగినట్లు చెప్పింది. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. అయితే, విమానం నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయని చెప్పింది.

దీంతో ఫైర్‌ ఇంజన్లు హూటాహుటిన అక్కడికి చేరుకుని పొగను అదుపులోకి తీసుకొచ్చాయని పేర్కొంది. కాగా, విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ట్రబ్‌జాన్‌ ప్రభుత్వం వెల్లడించింది.

మరిన్ని వార్తలు