థాయ్‌లాండ్‌లో మోదీ.. కీలక ప్రసంగం

3 Nov, 2019 16:54 IST|Sakshi

ఆసియాన్​-భారత్​ సదస్సులో పాల్గొన్న మోదీ

బ్యాంకాక్‌: ఆసియాన్​ దేశాలతో బహుళ విభాగాల్లో సంబంధాల విస్తరణకు భారత్​ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్​లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. బ్యాంకాక్​లో జరిగిన 16వ ఆసియాన్​-భారత్​ సదస్సుకు హాజరయ్యారు. తీరప్రాంత రక్షణ సహా వ్యవసాయం, ఇంజినీరింగ్​, డిజిటల్​ సాంకేతికత, పరిశోధన రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. పలు అంశాల్లో ఆసియాన్​ కూటమిలోని సభ్యదేశాలతో కలిసి సహకరించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇండో-ఫసిఫిక్​ ప్రాంతానికి సంబంధించి పరస్పర సహకారంపై కూటమి దేశాలు, భారత్ ​ఏకాభిప్రాయంతో ఉండటాన్ని స్వాగతించారు మోదీ.

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరించాలన్న భారత్‌ కల త్వరలోనే సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త మార్పుల దిశగా భారత్​ అడుగులు వేస్తోందని తెలిపారు. బ్యాంకాక్​లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్​ స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని మోదీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. బ్యూరోక్రటిక్​ తరహా పాలనకు స్వస్తి పలికి.. నవభారతం దిశగా దేశం​ అడుగులు వేస్తోందని తెలిపారు.

థాయ్‌ ప్రధానితో భేటీ
థాయ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి జనరల్​ ప్రయూత్​ చాన్​ ఓ చాన్​తో ప్రధాని నరేంద్రమోదీ  భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో.. మయన్మార్​ కౌన్సిలర్​ అంగ్​సాన్​ సూకీతోనూ సమావేశమయ్యారు. సాయంత్రం జరిగే విందులో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు