అత్యాచారాలు సిగ్గుచేటు

19 Apr, 2018 02:14 IST|Sakshi
లండన్‌లో బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేతో ప్రధాని మోదీ కరచాలనం

దీనిపై రాజకీయాలు చేయడం తగదు: ప్రధాని మోదీ

టీ అమ్మిన వ్యక్తి రాయల్‌ ప్యాలెస్‌కు అతిధిగా రావడమే ప్రజాస్వామ్య గొప్పదనం

నోట్ల రద్దు చరిత్రాత్మక నిర్ణయం

నిజాయితీ కోసం ప్రజలు త్యాగాలు చేస్తారని నమ్మాను

లండన్‌: చిన్నారులపై అత్యాచారాలు సిగ్గుచేటని, దీనిపై రాజకీయాలు తగవని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.  కఠువా, ఉన్నావ్‌ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానమంత్రిని కాదని, 125 కోట్ల మంది భారతీయులకు సేవకుడినని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందన్న ప్రధాని.. భారత్‌ పట్ల ప్రపంచ దేశాల దృక్కోణం మారిందన్నారు. భారత్‌ శాంతికాముక దేశమే కానీ.. దేశ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే ఉపేక్షించబోమంటూ పాక్‌పై గతంలో జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను గుర్తు చేశారు.

బ్రిటన్‌ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన లండన్‌లోని ప్రఖ్యాత సెంట్రల్‌ హాల్, వెస్ట్‌ మినిస్టర్‌ వేదికగా తన అభిప్రాయాలను ‘భారత్‌ కీ బాత్‌.. సబ్‌ కే సాథ్‌’ పేరుతో స్థానిక భారతీయులతో పంచుకున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ చైర్మన్‌ ప్రసూన్‌ జోషి ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమం దాదాపు గంటన్నర పైగా సాగింది. ఈ సందర్భంగా పలువురికి మోదీ ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే..

భారత్‌లో చిన్నారులపై అత్యాచారాలపై..
రేప్‌ అనేది దారుణం. ఆందోళనకరం. దాన్ని ఎలా అంగీకరిస్తాం? మన బిడ్డలపై అత్యాచారాలు దేశానికే సిగ్గుచేటు. ఈ దారుణాలకు పాల్పడే వారు కూడా ఒక తల్లి బిడ్డలే. దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలు అత్యంత బాధాకరం. చిన్న బాలికపై అత్యాచారం జరిగినపుడు చాలా బాధనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. కానీ మీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఇన్ని జరిగాయి. మా ప్రభుత్వంలో తక్కువ జరిగాయని చెప్పవచ్చా. వయసొచ్చిన కూతురు సాయంత్రం ఇంటికి ఆలస్యంగా వస్తే తల్లిదండ్రుల్లో ఆందోళన నాకు తెలుసు.

విమర్శలపై..: విమర్శలను స్వాగతిస్తాను. వాటికి మాటలతో సమాధానం ఇవ్వాలనుకోను. తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటాను. నేను చరిత్రలో నిలిచిపోవాలనుకోవడం లేదు. నా విధిని సక్రమంగా నిర్వర్తిస్తే చాలనుకుంటున్నాను.  

నోట్ల రద్దుపై..: నోట్ల రద్దు చారిత్రక నిర్ణయం. నిజాయితీ, పారదర్శకత కోసం ప్రజలు కొంతవరకు త్యాగం చేస్తారని నేను విశ్వసించాను.  

బలహీనతలపై..: నేను సామాన్యుడినే. అందరిలో ఉండే బలహీనతలు నాకూ ఉన్నాయి. సామాన్య స్థాయి నుంచే వచ్చాను. నాకు గొప్పగొప్ప నానమ్మలు, తాతయ్యలు లేరు. నేను కష్టపడతాను. ఈ విషయాన్ని నా దేశ ప్రజలు కూడా నమ్ముతారు.  

అధికారంలోకి వచ్చాక..: గత ప్రభుత్వాలతో పోలిస్తే అభివృద్ధి దిశగా దేశం దూసుకుపోతోంది. అధికారమిచ్చాం, అవకాశమిచ్చాం.. ఎందుకు చేసి చూపించరని ప్రజలు  ప్రశ్నించటమే నాకు సంతోషాన్నిస్తుంది. ప్రజలకు నా ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇదే సంకేతం. 125 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం. ఓ చాయ్‌ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కావటమే.. భారత ప్రజాస్వామ్యం గొప్పదనం. నేను రాయల్‌ ప్యాలెస్‌కు అతిథిగా రావటం 125 కోట్లమంది భారతీయుల సంకల్పమే.

ప్రజాఉద్యమంలా అభివృద్ధి: అభివృద్ధి కూడా స్వాతంత్య్రోద్యమం లాంటిదే. ప్రజలందరూ అభివృద్ధిపై తమ ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలి. అభివృద్ధి మన బాధ్యత. దేశం నాది, ఈ ప్రభుత్వం నాదనే భావన పెంచుకోవాలి అప్పుడు అభివృద్ధి ప్రజా ఉద్యమంలా దూసుకెళ్తుంది. ప్రజల భాగస్వామ్యం లేకుంటే మరుగుదోడ్ల నిర్మాణం కార్యక్రమం విజయవంతం కాకపోయేది. రైల్వే సబ్సిడీని 4 లక్షల మంది సీనియర్‌ సిటిజన్లు, ఎల్పీజీ సబ్సిడీని 1.25 కోట్ల మంది పౌరులు స్వచ్ఛందంగా వదులుకోవటమే దేశంలో ప్రజా భాగస్వామ్యానికి తార్కాణం.

సర్జికల్‌ స్ట్రైక్‌పై..
యూఎన్‌ శాంతిపరిరక్షక దళాల్లో ఎక్కువ భాగస్వామ్యం భారత్‌దే. అలాంటి శాంతికాముక దేశమైన భారత్‌.. పొరుగున్న పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. నా దేశ ప్రజలను చంపేస్తూ.. వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మా జవాన్ల తలలు నరుకుతున్నా నేను ఓపికగా ఉండలేకపోయాను. ఏ భాషలో చెబితే అవతలి వారికి అర్థమవుతుందో అలా చెప్పాను. సర్జికల్‌ స్ట్రైక్స్‌తో నా సైనికులు చేసిన పనికి నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఈ విషయంపై ముందు పాకిస్తాన్‌ మిలటరీకి సమాచారం ఇచ్చాకే భారత్‌లోనూ, మిగతా ప్రపంచానికి వెల్లడించాం.

పేదరికంపై..
నేను పుస్తకాలు చదివి పేదరికం అంటే ఏంటో తెలుసుకోలేదు. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ విషయంలో రాజకీయం సరికాదు. రాజకీయం వేరు, పేదల జీవితంలో మార్పు తీసుకురావాలనే నా సమాజ నీతి వేరు. 70 ఏళ్ల తర్వాత 18వేల గ్రామాలకు విద్యుత్‌ లేకపోవటం దారుణం కాదా? మా ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చకపోతే  అది పెద్ద తప్పు అవుతుంది. సౌభాగ్య పథకం ద్వారా 4కోట్ల కుటుంబాలకు (ఇళ్లకు) వెలుగునిచ్చాం. కొండలు, లోయలు, ఉగ్రవాద, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్‌ ఇచ్చాం. 3 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన లేని గ్రామాలయ్యాయి. ‘గరీబీ హఠావో’ నినాదంతో తొలగిపోదు. ఆ దిశగా పనిచేయాలి.

ఆయుష్మాన్‌ భారత్‌
పిల్లలకు సరైన విద్య, యువతకు ఉపాధి, అసహాయులకు సరైన వైద్యం అందించటమే మా ప్రభుత్వ లక్ష్యం. దీనికోసమే పనిచేస్తున్నాం. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని మోదీ కేర్‌గా పిలిస్తే నాకు అభ్యంతరమేం లేదు. సమగ్ర వ్యూహంతో ఈ పథకాన్ని రూపకల్పన చేశాం. తొలిగా దేశవ్యాప్తంగా 2 లక్షల వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతాం. పేదల కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. జెనరిక్‌ మందులను అందుబాటులోకి తెచ్చాం. స్టెంట్ల ధరలు తగ్గించాం. పిల్లల ఆరోగ్యం కోసం గర్భిణులకు 26వారాల ప్రసూతి సెలవులిస్తున్నాం.

ఇదే నా జీవితం
సీఎంగా ఉన్నప్పుడు నాకు వచ్చిన కానుకలను వేలం వేసి.. ఈ డబ్బును బాలిక విద్యకు వెచ్చించాను. ఈ మొత్తం 100 కోట్లకు పైమాటే. రాజకీయ జీవితంలో ఉన్నందున రెండు దశాబ్దాలుగా రోజూ విమర్శలు నాకు అలవాటైపోయాయి. ఎవరిపైనా ఆధారపడకుండా.. నవ్వుతూ, ఆహ్లాదంగా ఉంటూ ప్రాణాలు పోవాలి. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు యోగ, ధ్యానం చేస్తాను. యువతకూడా యోగపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అంతర్గత ఆరోగ్యానికి అదే అసలైన శక్తినిస్తుంది.


గాంధీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్, డయానా!
ప్రధాని మోదీ ప్రసంగించిన లండన్‌లోని సెంట్రల్‌హాల్‌ వెస్ట్‌మినిస్టర్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. మహాత్మా గాంధీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ వంటి ఎందరో గొప్ప వ్యక్తులు గతంలో ఆ వేదికపై నుంచి ఉపన్యాసాలిచ్చారు. 1912 అక్టోబరులో ఈ వేదికను ప్రారంభించారు. అప్పట్లో ఇది మెథడిస్ట్‌ సెంట్రల్‌ హాల్‌ పేరుతో చర్చి, సమావేశ మందిరంగా ఉండేది.

అప్పట్లో అనేక రకాల సమావేశాలకు, వేడుకలకు, చర్చలకు వేదికగా ఉండేది. 1946లో తొట్టతొలి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగింది కూడా సెంట్రల్‌హాల్‌ వెస్ట్‌మినిస్టర్‌లోనే. 1931లో భారత స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు గాంధీ యూకేలో పర్యటించి ఇక్కడే ప్రసంగించారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా, మానవ హక్కుల కోసం పోరాడిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్, బౌద్ధమత గురువు దలైలామా, యువరాణి డయానా తదితరులు ఈ వేదికపై నుంచి ప్రసంగించిన వారిలో అత్యంత ప్రముఖులు.

బసవేశ్వరుడికి పుష్పాంజలి
ప్రధాని మోదీ బుధవారం థేమ్స్‌ నది ఒడ్డున అల్బర్ట్‌ ఎంబ్యాంక్‌మెంట్‌ గార్డెన్‌లోని 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. లండన్‌లోని బసవేశ్వర ఫౌండేషన ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కర్ణాటకలో లింగాయత్‌లు, వీరశైవులకు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ హోదా కల్పిస్తూ ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో మోదీ బసవేశ్వరుడికి నివాళులర్పించటం ప్రాధాన్యత సంతరించుకుంది.  

అదే స్నేహం..బలమైన బంధం!
భారత్‌–యూకే ద్వైపాక్షిక బంధాలపై మోదీ, థెరిసా మే
లండన్‌: బ్రెగ్జిట్‌ (ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలగటం)తో సంబంధం లేకుండా భారత–యూకే సంబంధాలు మునుపటిలాగే బలంగా ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కామన్వెల్త్‌ దేశాధినేతల (చోగమ్‌) సదస్సుకోసం లండన్‌ చేరుకున్న మోదీ.. బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేతో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాల్లో మరింత పురోగతితో ముందుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బుధవారం ఉదయం 10, డౌనింగ్‌ స్ట్రీట్‌ (బ్రిటన్‌ ప్రభుత్వ కార్యాలయం)లో జరిగిన ఈ సమావేశంలో.. నేరస్తుల అప్పగింత, న్యాయపరమైన అంశాలు, రక్షణ, భద్రతాపరమైన అంశాలు, పరస్పర మిలటరీ సహకారంతోపాటుగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఆన్‌లైన్‌ ఉగ్రవాదం తదితర అంశాల్లో కలిసి పనిచేసేందుకు నిర్ణయించినట్లు ఇరుదేశాధినేతలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

  ‘ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక బంధాలకు కొత్త నిర్వచనం పలికేలా చర్చలు జరిగాయి. భారత్‌–యూకే సంబంధాల్లోని బహుముఖ అంశాలపై వీరిద్దరు విస్తృతంగా చర్చించారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. బ్రెగ్జిట్‌ అనంతరం కూడా భారత్‌–యూకే సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని మోదీ తెలిపారన్నారు. చోగమ్‌ సదస్సుకోసం మంగళవారం రాత్రి ప్రధాని లండన్‌ చేరుకున్న మోదీకి ఆ దేశ విదేశాంగ మంత్రి బోరిస్‌ స్వాగతం పలికారు. కాగా, బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా సైన్స్‌ మ్యూజియంను మోదీ సందర్శించారు.

భారత్‌–బ్రిటన్‌ కొత్త వాణిజ్య భాగస్వామ్యం
మోదీ పర్యటనను పురస్కరించుకుని బ్రిటిష్‌ ప్రభుత్వం బుధవారం కొత్త భారత్‌–యూకే వాణిజ్య భాగస్వామ్య పథకాన్ని ప్రకటించింది. ఈ కొత్త భాగస్వామ్యంలో భాగంగా బ్రిటన్‌లో భారత్‌ పెట్టే బిలియన్‌ పౌండ్ల (రూ.9,340 కోట్లు) పెట్టుబడితో 5,750 కొత్త ఉద్యోగాలు వస్తాయని యూకే అంతర్జాతీయ వాణిజ్య విభాగం వెల్లడించింది. దీని లెక్కల ప్రకారం భారత్, బ్రిటన్‌ మధ్య వస్తు, సేవల రూపంలో 2017లో 18 బిలియన్‌ పౌండ్ల వ్యాపారం జరిగింది. 2016తో పోలిస్తే ఇది 15% పెరిగింది. 


                                            బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో ఎలిజబెత్‌ రాణితో మోదీ


                            లండన్‌లోని డౌనింగ్‌ స్ట్రీట్‌లో మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్న నిరసనకారులు

మరిన్ని వార్తలు