ట్రంప్‌ హాజరవడం ఆనందంగా ఉంది: మోదీ

16 Sep, 2019 15:09 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యాటనలో భాగంగా సెప్టెంబర్‌ 22న జరగబోయే ‘హౌడీ-మోదీ’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. హూస్టన్‌లోని స్వచ్ఛంద సంస్థ టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) హౌడీ-మోదీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అత్యధికంగా 50 వేల మంది ప్రవాస భారతీయులు పాల్గొననున్నారు. ఈ సభకు ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా హజరుకానున్నట్లు ఆదివారం వైట్‌ హౌజ్‌ అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ విషయం పై స్పందించారు.

‘ఈ మెగా కార్యక్రమానికి ట్రంప్‌ హాజరవడం ఆనందంగా ఉంది. దీంతో ఇండియా-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచుస్తున్నాను’ అంటూ ప్రధాని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది మోదీ, ట్రంప్‌ కలిసి భేటి కావడం ఇది మూడోసారి. మొదటి, రెండుసార్లు జపాన్‌లో జరిగిన జీ-20 సదస్సు, జూలైలో జీ-7 సదస్సుకు వీరిద్దరు కలిసి హాజరయ్యారు. కాగా ఇద్దరు నాయకులు కలిసి ఒకే సభలో ప్రసంగించడం ఇదే మొదటిసారి. కావున ఈ సభకు తగిన ఏర్పాట్లు చేయాలని ట్రంప్‌ అదికారులకు సూచించారు. ఒక మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం జూలైలో జరిగిన సదస్సులో వీరిద్దరు పాల్గొన్నప్పుడు ప్రధాని మోదీ.. ట్రంప్‌ను ఈ సభకు హాజరు కావాలని కోరినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు