ఆంటీగ్యాంగ్‌ పట్టివేత..

8 Aug, 2017 16:55 IST|Sakshi
ఆంటీగ్యాంగ్‌ పట్టివేత..

షాంఘై: రుణ గ్రహీతల వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్న ఆంటీగ్యాంగ్‌ ఆట కట్టింది. అప్పులు తీసుకుని చెల్లించని వారి నుంచి వసూలుకు బండబూతులు తిట్టడం, వారి బట్టలూడదీయటం వంటి చర్యలకు పాల్పడుతున్న మహిళలను చైనా పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

హునాన్‌ ప్రావిన్స్‌ షాంక్వి సిటీలో దాదాపు 30 మంది సభ్యులున్న ఈ ముఠాను ఆంటీగ్యాంగ్‌గా పిలుస్తుంటారు. పదేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్న వీరి వయస్సు కూడా 50 ఏళ్లకు అటూఇటూగానే ఉంటుంది. బడా నిర్మాణ సంస్థలకు ఈ ముఠా అప్పులు వసూలు చేసి పెడుతుంది.

అప్పులు వసూలు చేసేందుకు వీరు పాల్పడుతున్న చర్యలు చాలా పాశవికంగా ఉంటాయి. చెప్పిన సమయానికి డబ్బు ఇవ్వని రుణ గ్రహీతల ఇళ్ల వద్దకు వెళ్లి మైక్‌లు అందుకుని తిట్ల పురాణం మొదలెడతారు. లేకుంటే మొహంపై ఉమ్మేస్తారు. పని అయిందా సరే..కాకుంటే..? అప్పు తీసుకున్న వ్యక్తి మహిళ అయితే వాళ్ల దుస్తులు చించేస్తారు.

అదే పురుషుడు అయితే తమ దుస్తులే చించేసుకుని అరిచి కేకలు పెడతారు. ఆ దెబ్బతో ఎంత మొండి బకాయి అయినా వసూలు కావాల్సిందే. అయితే, వీరి వ్యవహారం మితిమీరింది. వీరిపై ఫిర్యాదులు అందుకున్న అధికారులు.. నాలుగేళ్ల పాటు దర్యాప్తు చేపట్టి అందరిని కటకటాల వెనక్కు నెట్టేశారు.

నేరం రుజువు కావటంతో ఆంటీగ్యాంగ్‌లోని 14 మందికి 11 ఏళ్ల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయి. రోజుకు 30 డాలర్లతో పాటు భోజనం ఫీజుగా తీసుకునే ఈ ముఠాలోని మహిళలు ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదని పోలీసులు వివరించారు. ఈ ముఠాకు అధినేత్రి గవో యున్‌ అనే అంధురాలు కావటం గమనార్హం.

మరిన్ని వార్తలు