ముంచుకొస్తున్న తుఫాన్: విమానాలు రద్దు

22 Jan, 2016 18:55 IST|Sakshi


వాషిగ్టన్: అమెరికా తూర్పు తీర ప్రాంతాన్ని ముంచెత్తడానికి మంచు తుఫాను ముంచుకొస్తుంది. అక్కడి ఐదు రాష్ట్రాలు ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించి తుఫాన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వేలాది విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్తో పాటు ఇతర తూర్పుతీర ప్రాంత నగరాల్లో మంచు తుఫాను మూలంగా భారీగా మంచు మేటలు పేరుకుపోనున్నట్లు తెలుస్తోంది.

వాషింగ్టన్, బాల్టీమోర్లలో అక్కడి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నానికి తుఫాను ప్రభావం చూపనుంది. న్యూయార్క్ ప్రాంతంలో శనివారం ఉదయానికి తుఫాను ప్రభావం ఉండోచ్చని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫానును ఎదుర్కోవడానికి 300 సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వర్జీనియా నేషనల్ గార్డ్ అధికారులు తెలిపారు. వాషింగ్టన్ డీసీలోని రద్దీగా ఉండే సబ్వేలను శుక్రవారం రాత్రి నుండి ఆదివారం వరకు మూసేస్తున్నట్లు మెట్రోపాలిటన్ అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావం ఉండే ప్రాంతాలలోని ప్రజలు ముందు జాగ్రత్తగా అహారం, ఇతర కనీస అవసరాలను సమకూర్చుకుంటున్నారు.
 

>
మరిన్ని వార్తలు