చైనాలో కుప్పకూలిన కరోనా ఆస్పత్రి..!

7 Mar, 2020 21:44 IST|Sakshi

ఫ్యూజియాన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ను ఎదుర్కోవడంలో చైనా విజయం సాధించిందనే చెప్పాలి. హుబే ప్రావిన్స్‌లోని వుహాన్‌ నగరంలో వెలుగుచూసిన ఈ ప్రాణాంతక వైరస్‌ బారినపడిన వేలాది జనానికి చికిత్స అందించేందుకు చైనా హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, పాఠశాలలు, కాలేజీలు, ఆడిటోరియంలను ఆస్పత్రులుగా మార్చివేసింది. ఈక్రమంలో ఫ్యూజియాన్ ప్రావిన్స్‌ క్వాన్‌జౌ నగరంలో కరోనా బాధితులకు చికిత్సాలయంగా పనిచేస్తున్న ఓ హోటల్‌ భవనం శనివారం కుప్పకూలింది.

ఈఘటనలో 80 మంది కరోనా బాధితులు శిథిలాల్లో చిక్కుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 34 మందిని రక్షించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఫ్యూజియాన్ ప్రావిన్స్‌లో 296 కరోనా కేసులు నమోదయ్యాయని, పదివేలకు పైగా కరోనా అనుమానితులను గుర్తించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలాఉండగా..  ప్రపంచవ్యాప్తంగా గురువారం నాటికి 95,000 మంది ప్రజలకు కరోనా వైరస్‌ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు ఈ వైరస్‌ వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్‌ వ్యాప్తి, ఇతర ప్రాంతాల్లో ఎక్కువ వ్యాపిస్తోంది. భారత్‌లో శనివారం వరకు 34 కరోనా కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు