కోటను విడిచినా వారు మా కుటుంబ సభ్యులే..

19 Jan, 2020 14:26 IST|Sakshi

లండన్‌ : బ్రిటన్‌ రాజకుటుంబం నుంచి వేరుపడాలని ప్రిన్స్‌ హ్యారీ మేఘన్ మార్కెల్‌ దంపతుల నిర్ణయానికి సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లో జరిగిన సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం క్వీన్ ఎలిజబెత్ ’టూ)వారి నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ రాజకుటుంబంలో ఈ జంట పాత్రకు సంబంధించి మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆమె నొక్కి చెప్పారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం శనివారం రాత్రి క్వీన్ ఒక ప్రకటనను విడుదల చేశారు.  ఇక రాజకుటుంబం నుంచి విడిపోవాలని వారు నిర్ణయించిన క్రమంలో రాయల్‌ ఫ్యామిలీలో సభ్యులు కానందున సస్సెక్స్ వారి హెచ్‌ఆర్‌హెచ్‌ శీర్షికలను ఉపయోగించరాదని స్పష్టం చేశారు. అయితే, నివేదికల ప్రకారం వారిని డ్యూక్ మరియు డచెస్ ఆఫ్ సస్సెక్స్ అని పిలుస్తారు.

మరోవైపు వారి బ్రటిన్‌ కుటుంబ ఇల్లుగా కొనసాగే ఫ్రాగ్‌మోర్‌ కాటేజ్‌ పునరుద్ధరణపై ప్రభుత్వం వెచ్చించిన సొమ్మును వారు తిరిగి చెల్లించాలని ప్యాలెస్‌ ప్రకటించింది. వార్తాకథనాల ప్రకారం ఇంటి పునరుద్ధరణకు వెచ్చించిన రూ 22.2 కోట్లను వారు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాజకుటుంబం నుంచి వేరుపడాలని వారు నిర్ణయం తీసుకున్నా హ్యారీ, మేఘన్‌, ఆర్చీ తమ కుటుంబ సభ్యుల్లో భాగంగానే ఉంటారని, గత రెండేళ్లుగా వారిపై కొనసాగుతున్న నిఘాతో వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్టు తాను గుర్తించానని ఆమె వ్యాఖ్యానించారు. నెలల తరబడి సాగిన సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. రాజకుటుంబం నుంచి వెనుదిరుగుతూ వారు సకల సౌకర్యాలను కాలదన్నడంతో పాటు హ్యారీ తాను నిర్వర్తించే అధికారిక సైనిక నియామకాల నుంచి కూడా వైదొలగనున్నారు.

కాగా మేఘన్‌ ప్రస్తుతం తన కుమారుడు అర్చీతో కలిసి కెనడాలో ఉన్నారు. కాగా 2018 మేలో తనకంటే మూడేళ్లు పెద్దదైన మేఘన్‌తో ప్రిన్స్‌ హ్యారీ వివాహ బంధంతో ఒక్కటవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కల్గించింది. ప్రిన్స్ హ్యారీది రాజకుటుంబం అయితే..  సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మేఘన్ మార్కెల్‌తో కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా కలిగిన పరిచయం పరిణయానికి దారితీసింది. ప్రిన్స్‌ పెళ్లాడిన మేఘన్‌కు ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.

చదవండి : మేఘన్‌ మార్కెల్‌ కొత్త అవతారం

చదవండి :ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ ఉండే బంగ్లా ఇదే!

మరిన్ని వార్తలు