మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తా: పాక్‌ సింగర్‌

23 Oct, 2019 12:37 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ఆత్మాహుతి దాడితో భారత ప్రధాని నరేంద్ర మోదీని అంతం చేస్తానంటూ పాకిస్తాన్‌ సింగర్‌ రబీ పిర్జాదా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మోదీని హిట్లర్‌గా అభివర్ణించిన ఆమె.. సూసైట్‌ జాకెట్‌ ధరించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ క్రమంలో భారత నెటిజన్లు ఆమె చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పాకిస్తాన్‌కు ఉగ్రవాదం పెంచిపోషించడం మాత్రమే తెలుసు అని మరోసారి నిరూపితమైందని మండిపడుతున్నారు. మరికొంత మంది పాకిస్తాన్‌ సంప్రదాయ వస్త్రధారణలో చాలా అందంగా ఉన్నావంటూ రబీ తీరుపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలతో రబీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తన పెంపుడు పాములు, మొసళ్లకు భారత ప్రధాని నరేంద్ర మోదీని విందు చేస్తానంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. 

ఇందులో భాగంగా తన వద్ద ఉన్న నాలుగు అనకొండలను, ఒక మొసలిని మోదీకి గిఫ్ట్‌గా పంపిస్తానని పేర్కొన్న రబీ.. ‘కశ్మీరీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీ..  నరకంలో చావడానికి సిద్ధంగా ఉండు. నా స్నేహితులు నిన్ను విందు చేసుకుంటాయి అని పదే పదే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భారత నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అదే విధంగా అరుదైన వన్యప్రాణులతో వీడియో చేసినందుకు, వాటిని ఇంట్లో పెట్టుకున్నందుకు పిర్జాదాపై పంజాబ్‌లోని పాక్ వ్యనప్రాణి సంరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దర్యాప్తునకు ఆదేశించింది. పిర్జాదాపై నేరం రుజువైతే ఆమెకు రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా రబీ పిర్జాదా పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఓ ఆర్మీ అధికారి కూతురు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ రద్దు చేసిన నాటి నుంచి ఆమె భారత ప్రభుత్వ తీరుపై మండిపడుతోంది. అప్పటి నుంచి భారత వ్యతిరేక ఆందోళనలలో చురుకుగా పాల్గొంటూ మోదీని టార్గెట్‌ చేస్తూ ఘాటు విమర్శలు చేస్తోంది.

మరిన్ని వార్తలు