లైవ్‌లోకి వచ్చేసిన బుడతడు..

11 Oct, 2019 19:15 IST|Sakshi

న్యూస్‌ రూమ్‌లో నుంచి విశ్లేషణ అందిస్తున్న మహిళ రిపోర్టర్‌కు ఆమె కొడుకు వల్ల చిన్నపాటి ఇబ్బంది కలిగింది. అయితే అందుకు సంబంధించిన వీడియో ఆ చానల్‌ వాళ్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. కుబె అనే మహిళ ఎంఎస్‌ఎన్‌బీసీ చానల్‌లో న్యూస్‌ కరస్పాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రోజున ఉత్తర సిరియాలో టర్కీ దాడులకు సంబంధించిన విశ్లేషణను ఆమె లైవ్‌లో అందిస్తున్నారు. విశ్లేషణ మధ్యలో కుబె కొడుకు ర్యాన్‌.. వెనకాల నుంచి వచ్చి ఆమెను పట్టుకున్నాడు. దీంతో అప్రమత్తమైన ఆమె ‘నన్ను క్షమించండి, నా పిల్లలు ఇక్కడే ఉన్నార’ని చెప్పారు. మళ్లీ వెంటనే తన విశ్లేషణను ప్రారంభించారు. అయితే ఈ సమయంలో చానల్‌ స్క్రీన్‌పై ఆ విశ్లేషణకు సంబంధించిన గ్రాఫిక్‌ విజువల్‌ను ప్లే చేశారు. 

ఈ దృశ్యాలను ఎంఎస్‌ఎన్‌బీసీ తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. కొన్నిసార్లు బ్రేకింగ్‌ న్యూస్‌ కవర్‌ చేసేటప్పడు.. అనుకోని బ్రేకింగ్‌ న్యూస్‌ జరుగుతుందని పేర్కొంది. #workingmoms అనే ట్యాగ్‌ కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 3.4 మిలియన్ల మంది దీనిని వీక్షించారు. వర్క్‌ ప్లేస్‌లోకి పిల్లల్ని తీసుకురావడానికి అవకాశం కల్పించిన ఆ చానల్‌ నిర్వహకులను కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గతంలో బీబీసీ చానల్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు