రానున్న 48 గంటల్లో ఇంటర్నెట్‌ సేవలకు బ్రేక్‌

12 Oct, 2018 10:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రధాన సర్వర్‌ నిర్వహణ పనుల నేపథ్యంలో రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం కలగనుంది. రొటీన్‌ మెయింటినెన్స్‌లో భాగంగా ప్రధాన సర్వర్‌, దానికి సంబంధించిన కనెక్షన్లను నిలిపివేయనున్నారని.. ఫలితంగా ఇంటర్నెట్‌ సేవలకు కొద్దిసేపు ఆటంకం కలుగుతుందని ‘రష్యా టుడే’ వెల్లడించింది.

ప్రధాన సర్వర్‌ నిర్వహణను ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌(ఐసీఏఎన్‌ఎన్‌) చేస్తుంది. ఇందులో భాగంగా క్రిప్టోగ్రాఫిక్‌ కీని మారుస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్‌ అడ్రస్‌ బుక్‌ లేదా డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ (డీఎన్‌ఎస్‌) భద్రంగా ఉంటుంది. ఇటీవల ఎక్కువైన సైబర్‌ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాన సర్వర్‌ నిర్వహణ పనులు నిర్వహణ పనులు తప్పనిసరని ఐసీఏఎన్‌ఎన్‌ పేర్కొంది.

‘సురక్షితమైన, స్థిరమైన డీఎన్‌ఎస్‌ను పొందడం కోసం కొద్దిసేపు ప్రపంచ నెట్‌వర్క్‌ను షట్‌డౌన్‌ చేయడం అవసరం. అందువల్ల రానున్న 48 గంటల్లో వెబ్‌ పేజీలను యాక్సెస్‌ చేయయంలో, ట్రాన్సాక్షన్స్‌ జరపడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంద’ని కమ్యూనికేషన్‌ రెగ్యులేటరీ అథారిటీ(సీఆర్‌ఏ) ప్రకటించింది. అవుట్‌డేటెడ్‌ ఐఎస్‌పీ(ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌) వాడకందారులు ఈ అసౌకర్యాన్ని చవి చూస్తారని వెల్లడించింది.

మరిన్ని వార్తలు