అగ్రరాజ్యంలో.. ఉచితంగా భోజనం పెడుతున్న పాకిస్తానీ

21 May, 2019 13:07 IST|Sakshi

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికాలో వైట్‌ హౌస్‌కు కొద్ది దూరంలో సకినా హలాల్‌ గ్రిల్‌ అనే ఓ హైఫై రెస్టారెంట్‌ ఉంది. ఆ చుట్టుపక్కల ఇంకొన్ని రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. కానీ వాటికి, సకినా రెస్టారెంట్‌కు ఓ తేడా ఉంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే.. దర్జగా హలాల్‌ రెస్టారెంట్‌కు వెళ్లి కడుపునిండా నచ్చిన భోజనం తిని రావచ్చు.  మిమ్మల్నేవరు బిల్లు కట్టమని ఇబ్బంది పెట్టరు. నమ్మశక్యంగా లేకపోయినప్పటికి ఇది వాస్తవం. గత ఐదేళ్లలో ఇప్పటికే దాదాపు 80 వేల మందికి ఉచితంగా ఆహారం పెట్టి కడుపు నింపింది ఈ రెస్టారెంట్‌.

వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన ఖాజి మన్నన్‌ అనే వ్యక్తి 2013లో అమెరికాలో ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించాడు. ఎవరైనా సరే నాకు ఉచితంగా భోజనం కావాలని అడిగితే.. ‘రండి.. తృప్తిగా భోంచేసి వెళ్లండి. డబ్బులు చెల్లించే వారు ఎంత దర్జాగా తింటారో మీరు కూడా అలానే తినండి. మొహమాట పడకండి’ అంటున్నారు ఖాజి. ఈ ఆలోచన వెనక తాను పడిన కష్టాలున్నాయంటారు ఖాజి.

‘నా చిన్నతనంలో ఓ పూట తిండి దొరికితే చాలనుకునేవాన్ని. ఆహారం కోసం నేను పడిన కష్టం మరొకరు పడకూడదనుకున్నాను. అందుకోసం రాత్రింబవళ్లు శ్రమించి పైసా పైసా కూడబెట్టి ఈ రెస్టారెంట్‌ని​ ప్రారంభించాను. ఇప్పటికి కూడా చెత్త కుప్పల దగ్గర ఆహారం ఏరుకునే జనాలను చూస్తే నాకు ఎంతో బాధ కల్గుతుంది’ అంటారు ఖాజి. ఈ ఏడాది నుంచి మరింత మందికి తన సేవలను అందించాలనుకుంటున్నారు ఖాజి.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
వాషింగ్టన్‌‌లో ఓ రెస్టారెంట్‌ ఉచితంగా భోజనం

మరిన్ని వార్తలు