8వ ఖండం.. బ్లాక్‌ హోల్‌.. కొత్త దేశం..

26 Dec, 2019 13:49 IST|Sakshi

రౌండప్‌- 2019

ప్రపంచంలో ప్రతి ఏటా ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు, ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటాయి. మనం రోజు చూసే పరిసరాలు కూడా ఒక్కోసారి వింతగా కనిపిస్తూ ఉంటాయి. ఓ సినీ రచయిత చెప్పినట్టు అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. జరిగిన తరువాత గుర్తించాల్సిన పని లేదన్నది అక్షర సత్యం అనిపిస్తుంది. అది ఈ ఏడాది కూడా రుజువైంది. కాలానుగుణంగా ఎన్నో అద్భుతాలు  2019లో చోటుచేసుకున్నాయి. అలాంటి కొన్ని విశేషాలను ఓ సారి గమనిస్తే..

14 కోట్ల ఏళ్ల కిందట అమెరికా నుంచి విడిపోయి.. 
నెదర్లాండ్ శాస్త్రవేత్తలు 8వ ఖండాన్ని కనిపెట్టారు. గ్రేటర్ ఆడ్రియా అని దీనికి పేరు పెట్టిన శాస్త్రవేత్తలు.. 14 కోట్ల ఏళ్ల కిందట ఇది అమెరికా నుంచి విడిపోయి దక్షిణ ఐరోపా కిందకు చేరిపోయిందన్నారు. మధ్యధరా ప్రాంతంలోని భౌగోళిక శాస్త్ర పరిణామక్రమాన్ని శోధిస్తుండగా.. ఈ ఖండం కనిపించగా, ఆడ్రియాటిక్ సముద్రం నుంచి ఇటలీ వరకూ విస్తరించి ఉండగా, ఈ ప్రాంతాన్ని భూగర్భశాస్త్రవేత్తలు ఆడ్రియగా పిలుస్తున్నారు.


అకలి ఎంత పనైనా చేయిస్తుంది..

అకలి ఎంత పనైనా చేయిస్తోందంటారు. అందుకు నిదర్శనంగా ఓ ఆర్కిటిక్‌ నక్క.. మంచుగడ్డల్లో ఆహారం కోసం 3500 కి.మీ దూరాన్ని 76 రోజుల్లో ప్రయాణించి రికార్డు సాధించింది. నార్వే లోని స్వాల్బార్డ్ అనే ద్వీప సమూహం నుంచి బయలుదేరి కెనడా లోని ఉత్తర నునవట్ ద్వీపాల్లో ఒక దానికి చేరుకోడంతో దాని ప్రయాణం ముగిసింది. ఈ పరిణామం 2018లో జరిగినప్పటికీ.. ఈ ఏడాది శాస్త్రవేత్తలు అధికార ప్రకటనతో వెలుగులోకి వచ్చింది. 

నెల రోజుల్లోనే రెండు కాన్పులు..
ఓ మహిళ నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. బంగ్లాదేశ్‌కు చెందిన అరీఫా సుల్తానా ఫిబ్రవరి నెలలు నిండని మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపారు. అయితే 26 రోజుల తర్వాత అరీఫా మళ్లీ నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను ఇంకొక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అరీఫాను పరీక్షించిన వైద్యులు.. ఆమె గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నట్టు గుర్తించి ఆమె సిజేరియన్‌ చేశారు. ఆ పిల్లలు ఎలాంటి సమస్యలు లేకుండా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

చంద్రయాన్‌-2 విఫలమైనప్పటికీ.. 
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పత్రిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి ఉపరితలంపై దిగుతుండగా చివరి క్షణాల్లో కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం కాకపోయినప్పటికీ మంచి ఫలితాల్నే ఇచ్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, విక్రమ్ ల్యాండర్ జాడ కోసం అంతరిక్ష శాస్త్రవేత్తలు, సంస్థలు శోధనలు జరిపినప్పటికీ..  నాసా ఎల్ఆర్‌వో పంపిన ఫోటోల ఆధారంగా  చెన్నైకి  చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ షణ్ముగం సుబ్రమణ్యం (33) జాబిల్లిపై దాని శకలాలను విశేషం. 

పండటి బిడ్డలకు జన్మనిచ్చిన వృద్ధురాళ్లు..
70 ఏళ్లలో పండంటి బిడ్డలకు జన్మనివ్వడం ద్వారా భారత్‌కు చెందిన ఇద్దరు భామ్మలు అందరి దృష్టిని ఆకర్షించారు. 75 ఏళ్ల వయసులో రాజస్తాన్‌కు చెందిన ప్రభాదేవి అనే బామ్మ గర్భం దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.  అంతకుముందు ఆంధ్రప్రదేశ్​లో ఓ వృద్ధురాలు మంగాయమ్మ 73 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఐవిఎఫ్ ప్రక్రియ ద్వారా వీరు పిల్లలకు జన్మనిచ్చారు.

ఫొటోకు చిక్కిన బ్లాక్‌ హోల్‌ 
ఖగోళ చరిత్రలో సంచలన ఆవిష్కరణ చోటుచేసుకుంది. శాస్త్రవేత్తలు తొలిసారిగా ఓ కృష్ణ బిలాన్ని(బ్లాక్ హోల్‌ని) ఫొటో తీశారు. భూమికి 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎమ్87 గెలాక్సీలో ఈ కృష్ణ బిలం ఉంది. 


బ్రిడ్జి కింద చిక్కుకున్న విమానం..
చైనాలోని హార్బిన్‌లో ట్రక్కుపై తరలిస్తున్న ఓ విమానం బ్రిడ్జి కింద చిక్కుకుపోయింది. రోడ్డుపై ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా విమానం రెక్కలు తొలగించినప్పటికీ.. దురదృష్టవశాత్తూ ఆ వాహనం వంతెన కింద ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ట్రక్కు టైర్లలో గాలిని తగ్గించి.. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాన్ని ముందుకు కదిలించారు. దీంతో విమానం బ్రిడ్జి కింది నుంచి బయటికి వచ్చింది. 

ఉత్తర కొరియా గడ్డపై ట్రంప్‌..
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల రిహద్దుల మధ్య ఉన్న నిస్సైనిక మండలం(డీఎంజెడ్‌)లోని పన్‌మున్‌జొమ్‌ గ్రామంలో ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సమావేశమయ్యారు. పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా రావడం ఇదే మొదటిసారి.


కొత్త దేశంగా బౌగెన్‌విల్లే!
ప్రపంచ పటంలో కొత్త దేశం ఏర్పడనుంది. దక్షిణ పసిఫిక్‌ రీజియన్‌లోని  బోగన్‌విల్లె ద్వీపం త్వరలోనే స్వతంత్ర దేశంగా అవిర్భనుంచనుంది. పపువా న్యూ న్యూగినియా నుంచి స్వాతంత్య్రం కోరుతూ ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన రిఫరెండంలో 98 శాతం మంది స్వతంత్ర దేశానికే ఓటు వేశారు. 

కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం
పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ నవంబర్‌ 9న ప్రారంభమైంది. సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే కర్తార్‌పూర్‌ మందిరం.. 1947లో భారత్‌ను రెండు విభజించిన సమయంలో పాకిస్తాన్‌ భూభాగంలోకి వెళ్లిపోయింది. 

ఒకే కాన్పులో ఏడుగురు జననం
ఓ మహిళ ఒకే కాన్పులో ఏడుగురు శిశువులకు జన్మనిచ్చారు. ఈ అరుదైన ఘటన తూర్పు ఇరాక్‌లో చోటుచేసుకుంది. వారిలో ఆరుగురు ఆడపిల్లలు కాగా, ఒక మగ పిల్లాడు ఉన్నారు. ఇరాక్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు తెలిపారు. 

టెస్లా సైబర్‌ ట్రక్‌..
ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా.. సైబర్‌ట్రక్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ పికప్‌ట్రక్‌ను పరిచయం చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ వాహనానికి కేవలం నాలుగు రోజుల్లోనే 1.87 లక్షల ఆర్డర్లు వచ్చాయి. సైబర్‌ట్రక్‌ లాంఛ్‌ సందర్భంగా పనితీరును పరీక్షిస్తున్న సమయంలో రాయి వెహికల్‌ గ్లాస్‌ అద్దాలు బద్దలైనా రికార్డుస్ధాయిలో ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఈ ట్రక్‌ త్వరలోనే త్వరలోనే దుబాయ్‌ పోలీసుల వాహన శ్రేణిలో చేరనుంది.

-కనుకుల సుమంత్, సాక్షి వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు