రూల్స్‌ బ్రేక్‌ : వ్యక్తిని బెదరగొట్టిన ఖడ్గమృగం!

7 Apr, 2020 12:29 IST|Sakshi

ఖాట్మండు : లాక్‌డౌన్‌లో కూడా నిబంధనలను అతిక్రమించి రోడ్డుపై ఎంచక్కా నడుస్తున్న ఓ వ్యక్తిని బెదరగొట్టింది ఓ ఖడ్గమృగం. నేపాల్‌లో రోడ్డుపైకి వచ్చిన ఖడ్గమృగానికి సంబంధించి వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కాస్వాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన చిత్వాన్‌ నేషనల్‌ పార్క్‌ నుంచి భారీ జంతువులు తరచుగానే జనసంచారంలోకి వస్తుంటాయి. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తే కొందరు నిబంధనలను అతిక్రమిస్తూ బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే వీధులను తనిఖీ చేయడానికి ఖడ్గం వచ్చింది అంటూ ప్రవీణ్‌ కాస్వాన్‌ పోస్ట్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఖడ్గమృగం కుమ్మడానికి వెంబడించి, తర్వాత తనదారిన వెలిపోతుంది. 

కాగా ప్రవీణ్‌ కాస్వాన్‌ పోస్ట్‌ చేసిన వీడియోకు ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పిటర్సన్‌ స్మైలీ సింబల్‌తో బదులిచ్చారు. ఖడ్గమృగాన్నిచూసి వీధుల్లోని యువకుడు రాకెట్‌ స్పీడుతో అక్కడి నుంచి జారుకున్నాడు అంటూ ఓ నెటిజన్‌ సెటైర్‌ వేయగా, లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన ఆయువకుడిని తన గొప్ప మనసుతో ఖడ్గమృగం వదిలిపెట్టిందని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. కరోనా వైరస్‌ అరికట్టడానికి నేపాల్‌ ప్రభుత్వం మార్చి24న వారంపాటూ లాక్‌డౌన్‌ ప్రకటించి, తర్వాత ఏప్రిల్‌ 15 వరకు పొడిగించింది. దీంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారడంతో అడవుల్లోని జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి.

మరిన్ని వార్తలు