బిహేవియరల్ ఎకనమిక్స్లో విస్తృత పరిశోధనలు
ఆర్థిక, మనస్తత్వ శాస్త్రాల మధ్య సమన్వయాన్ని చూపిన ఆర్థికవేత్త
ఆర్థిక శాస్త్ర మార్గదర్శకులని థేలర్కు నోబెల్ జ్యూరీ ప్రశంస
రూ. 7.2 కోట్ల ప్రైజ్ మనీని అందుకోనున్న ఈ అమెరికన్ ప్రొఫెసర్
స్టాక్హోమ్: ఆర్థిక, మనస్తత్వ శాస్త్రాల సమన్వయంపై విశేష కృషి చేసిన ప్రముఖ ఎకనమిస్ట్ రిచర్డ్ థేలర్(72)ను ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డు వరించింది. ఆర్థికపరమైన నిర్ణయాలు ఎప్పుడూ పూర్తిగా హేతుబద్ధతపైననే ఆధారపడవని, మానవ సంబంధాల లోతైన ప్రభావం వాటిపై ఎక్కువగానే ఉంటుందని నిర్ధారించేలా ఆయన పరిశోధనలు సాగాయి. అమెరికాకు చెందిన థేలర్ యూనివర్సిటీ ఆఫ్ చికాగో లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తనకిష్టమైన ‘బిహేవియరల్ ఎకనమిక్స్’లో ఆయన విస్తృత పరిశోధనలు చేశారు. ఆ దృగ్విషయాన్ని ప్రతిపాదించిన తొలివ్యక్తిగా నిలిచారు. ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు లేదా బృందాలు తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాల్లో వారి మనస్తత్వం, వారికి సంబంధించిన సామాజిక, వ్యక్తిగత అంశాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగా ఎకనమిక్స్, సైకాలజీల మధ్య దూరాన్ని చెరిపేసి, వాటి మధ్య నెలకొన్న సంబంధాన్ని చూపే ప్రయత్నం చేశారు. అందుకే నోబెల్ జ్యూరీ.. ‘వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలు, మనస్తత్వ శాస్త్రాల మధ్య సమన్వయాన్ని సాధించిన తొలి శాస్త్రవేత్త’గా థేలర్ను గుర్తించింది. ఆర్థిక శాస్త్రానికి మరింత మానవీయతను సమకూర్చిన వ్యక్తిగా ఆయనను ప్రశంసించింది. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి బిహేవియరల్ ఎకనమిక్స్ను సాధనంగా చూపిన ఆయన సిద్ధాంతం ‘నడ్జ్ థీయరీ’గా పాపులర్ అయింది. ‘నడ్జ్’ అనే అత్యధిక కాపీలు అమ్ముడుపోయిన పుస్తకాన్ని కూడా ఆయన మరొకరితో కలసి రాశారు. థేలర్ ప్రతిపాదించిన మరో సిద్ధాంతం ‘మెంటల్ అకౌంటింగ్’. వినియోగదారులు తమ ఆదాయ, ఖర్చులను మనస్సులోనే లెక్కలేసుకుని, నిర్ణయాలను సులభతరం చేసుకుంటారని వివరించేదే ఆ సిద్ధాంతం. పరిమిత హేతుబద్ధత, స్వీయ నియంత్రణ లేకపోవడం, సామాజిక ప్రాధాన్యతలు.. వ్యక్తుల ఆర్థిక నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాలను ఆయన సమగ్రంగా విశ్లేషించారని నోబెల్ జ్యూరీ పేర్కొంది.
నటనలోనూ ప్రవేశం
ఆర్థికశాస్త్రంలో పరిశోధనలతోపాటుగా.. సినిమాల్లో అతిథిపాత్రల ద్వారా కూడా థేలర్ సుప్రసిద్ధుడు. 2015లో విడుదలైన ‘ద బిగ్ షాట్’ హాలీవుడ్ చిత్రంలో ఈయన క్రిస్టియన్ బేల్, స్టీవ్ కేరెల్, ర్యాన్ గాస్లింగ్లతో కలసి నటించారు. 2008లో వచ్చిన అంతర్జాతీయ ఆర్థికసంక్షోభం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో క్రెడిట్, హౌజింగ్ రంగాలు ఎలా ధ్వంసమయ్యాయో చూపించారు. ఆర్థిక నోబెల్ అవార్డును తనకు ప్రకటించటంపై జ్యూరీకి థేలర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘అవార్డుకు ఎంపికచేయటం ఆనందంగా ఉంది’ అన్నారు. ఆర్థిక విధానాల్లో మానవీయ కోణాన్ని అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ అవార్డుతోపాటు 1.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7.2 కోట్లు) ప్రైజ్మనీని ఆయన అందుకోనున్నారు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేస్తారన్న ప్రశ్నకు.. ఆయన నవ్వుతూ ‘ఎంత వీలైతే అంత నిర్హేతుకంగా’ అని జవాబిచ్చారు.
నోట్లరద్దుకు థేలర్ మద్దతు
నోట్లరద్దు నిర్ణయంపై గతంలోనే థేలర్ స్పందించారు. గత నవంబర్ 8న థేలర్ ట్వీట్ చేస్తూ.. ‘దీనికి నేను దీర్ఘకాలంగా మద్దతు తెలుపుతున్నాను. నగదురహిత ఆర్థిక వ్యవస్థకు, అవినీతిని తగ్గించే ప్రయత్నానికి మంచి ముందడుగు’ అని పేర్కొన్నారు. అయితే పెద్దనోట్లను రద్దుచేస్తూ తిరిగి 2వేల నోటును ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టారు. ‘రెండువేల నోటు తీసుకురావటం నిజమేనా? తప్పుడు నిర్ణయం’ అని అన్నారు. ఇదే వర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తున్న మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నోట్లరద్దు నిర్ణయాన్ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
థేలర్ పరిశోధనలు అద్భుతం: జ్యూరీ
‘థేలర్ ఓ మార్గదర్శకుడు. ఈయన ఆర్థికశాస్త్రాన్ని మరింత మానవీకరించారు. ఆర్థిక, మనస్త్తత్వ శాస్త్రాలను సమగ్రపరిచేలా సాగిన థేలర్ పరిశోధనలు అద్భుతం. పరిమిత హేతుబద్ధత, సామాజిక ప్రాధాన్యతలు, స్వీయ నియంత్రణ లేకపోవటం వంటి వాటి ప్రభావంపై ఈయన గొప్ప ప్రయోగాలు చేశారు. ఈ లక్షణాలు క్రమంగా వ్యక్తిగత నిర్ణయాలను, మార్కెట్ ఫలితాలను ఎలా ప్రభావితం చేయగలవో నిరూపించారు’ అని నోబెల్ జ్యూరీ పేర్కొంది. ‘ప్రవర్తనా ఆర్థికశాస్త్రంలో గణనీయమైన మార్పులు తేవడంలో థేలర్ చేసిన పరిశోధనలు, సైద్ధాంతిక ఆలోచనలు కొత్త ప్రపంచానికి బాటలు వేశాయి. ఆర్థిక పరిశోధనలు, విధివిధానాల నిర్ణయానికి సంబంధించిన అంశాల్లో ఇవి లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి’ అని జ్యూరీ వెల్లడించింది.