బ్రిటన్‌ ఆర్థికమంత్రిగా నారాయణమూర్తి అల్లుడు

13 Feb, 2020 18:56 IST|Sakshi

బ్రిటన్‌ ఆర్థికమంత్రిగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ (39) నియమితులయ్యారు. రిషి సునక్ పేరును ఆ దేశ కొత్త ఆర్థికమంత్రిగా బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఖరారు చేశారు. ఆర్థికమంత్రి  సాజిద్‌ జావిద్‌ అనూహ్య రాజీనామా  అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా  హోంశాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న ప్రీతి పటేల్‌, అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా అలోక్ శర్మ(51) కొనసాగించిన జాన్సన్ తన క్యాబినెట్‌లో  భారీ మార్పులను ట్విటర్‌ ద్వారా ప్రధాని షేర్‌  చేశారు.  

హాంప్‌షైర్‌లో జన్మించిన సునక్‌ 2015 నుండి యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌కు ఎంపీగా ఉన్నారు. గతేడాది ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా  ఎంపికయ్యే ముందు  జూనియర్ మంత్రిగా పనిచేశారు.  ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ చదివారు. ఆ తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచిఎంబీఏ పట్టా పొందారు. రిషి సునక్ తండ్రి డాక్టర్, ఫార్మాసిస్ట్. 2009 సంవత్సరంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని వివాహం చేసుకున్నారు. రిషి, అక్షతకు ఇద్దరు ఆడపిల్లలు. అక్షతతో ఆయనకు స్టాన్‌ఫర్డ్‌లోనే పరిచయం ఏర్పడింది. రాజకీయాల్లోకి రాకముందు రిషి సునక్ పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ల్లో పనిచేశారు. గోల్డ్‌మ్యాన్ సచ్ కంపెనీలో విశ్లేషకుడిగా సేవలు అందించారు. 

మరిన్ని వార్తలు