వైరల్‌: వీళ్లు మనసు దోచుకున్న దొంగలు!

16 Jun, 2020 20:34 IST|Sakshi

దొంగలు ఎప్పుడైనా ఏం చేస్తారు. మనుషుల్ని బెదిరించి దోచుకెళ్తుంటారు. వినకపోతే చితగ్గొట్టి మరీ విలువైన వస్తువుల్ని కొల్లగుడుతుంటారు. అయితే, పాకిస్తాన్‌లోని కరాచీలో మాత్రం ఓ ఇద్దరు దొంగలు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ వ్యక్తి దగ్గర దోచుకున్న సొమ్మంతా తిరిగి ఇచ్చేశారు. దాంతోపాటు అతనికి ఓ హగ్‌ కూడా ఇచ్చి వెళ్లిపోయారు. వివరాలు.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ను బెదిరించి అతని మనీ పర్స్‌, ఇతర విలువైన వస్తువులు లాక్కున్నారు.  బైక్‌ ఎక్కి అక్కడి నుంచి ఉడాయిద్దామనుకున్నారు.

కానీ, అంతలోనే మనసు మార్చుకుని... సదరు డెలివరీ బాయ్‌కి ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేశారు. ఇంతకూ వారి మనసు మారడానికి కారణమేంటో తెలుసా? దొంగలు తన వద్ద నున్న సొమ్ములను తీస్కుకుంటున్నప్పుడు సదరు డెలివరీ బాయ్‌ నిశ్చేష్టుడయ్యాడు. ఏమీ చేయలేక, వారిపై తిరగబడలేక ఏడుస్తూ ఉండిపోయాడు. దాంతో ఆ దొంగలు వస్తువుల్ని తిరిగి ఇచ్చేశారు. ఇదంతా సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. నిముషం నిడివి గల ఈ వీడియో సోషల్‌ వీడియోలో వైరల్‌ అయింది. దొంగల్లో కూడా మానవత్వం దాగుంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘వీళ్లు మామూలు దొంగలు కాదు. మనసు దోచుయున్న మంచి దొంగలు’ అని మరికొందరు పేర్కొన్నారు.
(చదవండి: గాల్వన్‌ లోయ మాదే : చైనా)

మరిన్ని వార్తలు