సామాజిక దూరం కోసం రోబో డాగ్‌

9 May, 2020 17:48 IST|Sakshi
రోబో కుక్క

సింగపూర్ : ప్రపంచ దేశాల ప్రజలను గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడకుండా తప్పించుకోవాలంటే సామాజిక దూరం పాటించడం ఒక్కటే శ్రేయస్కర మార్గమని ప్రపంచ దేశాలు ఘోషిస్తున్నప్పటికీ, లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నప్పటికీ పట్టించుకోని వారు కొందరుంటారు. ఆ కొందరి కోసం ‘బోస్టన్‌ డైనమిక్స్‌’ సంస్థ ఓ రోబోటిక్‌ డాగ్‌ను సృష్టించింది. సామాజిక దూరం పాటించని వారికి ‘స్పాట్‌’ పెట్టాలనే ఉద్దేశంతోనేమో దానికి ‘స్పాట్‌’ అని పేరు పెట్టారు. 

ఆ రోబో ప్రస్తుతం సింగపూర్‌లోని ‘బిషన్‌ ఆంగ్‌మో కియో’ పార్క్‌లో ప్రయోగాత్మకంగా తన విధులను నిర్వర్తిస్తోంది. ఎక్కడయితే మనుషులు గుమికూడారో గుర్తించి అక్కడికి  ‘దూరం దూరం’ అంటూ హెచ్చరికలు చేస్తూ దూసుకుపోతుంది. తల బాగాన అమర్చిన కెమెరాల ద్వారా మనుషులు గుమికూడిన చోటును ఆ రోబో గుర్తిస్తుంది. దూరం పాటించాలంటూ ముందుగా రికార్డు చేసిన వాయిస్‌ను వినిపిస్తోంది. ( కరోనా: 116 ఏళ్ల వృధ్దుడి కోరిక ఏంటంటే...)

ప్రయోగాత్మకంగా రోబో సేవలను ప్రవేశపెట్టామని, మున్ముందు దీన్ని మరింత అభివృద్ధి చేస్తామని ‘గవర్నమెంట్‌ టెక్పాలజీ ఏజెన్సీ’ మీడియాకు తెలియజేసింది. ఈ రోబోకు అమర్చిన కెమేరాలు వ్యక్తిగతం ఎవరి చిత్రాలనుగానీ, మాటలును గానీ రికార్డు చేయదని, పౌరుల వ్యక్తిగత గోప్యతకు పూర్తి భద్రత ఉంటుందని ఏజెన్సీ అధికారులు తెలిపారు. రోబో దగ్గరికి వస్తుంటే దూరం జరగాల్సిన సందర్శకులు ఏకంగా దూరం పారి పోతున్నారని పార్కు నిర్వాహకులు తెలిపారు. 

మరిన్ని వార్తలు