పంతం నెగ్గించుకున్న రష్యా

24 Aug, 2019 08:24 IST|Sakshi

తేలియాడే అణు రియాక్టర్‌ను ప్రారంభించిన రష్యా

మాస్కో: ప్రపంచంలోనే మొట్టమొదటి తేలియాడే అణు రియాక్టర్‌ను రష్యా ప్రారంభించింది. పర్యావరణవేత్తలు, సంస్థలు ఎంత హెచ్చరించినప్పటికీ వినని రష్యా.. తన పంతం నెగ్గించుకుంది. అకడమిక్‌ లొమొనొసొవ్‌గా పిలిచే ఈ రియాక్టర్‌ తన తొలి ప్రయాణంలో భాగంగా 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశాన్య సైబీరియాలోని పెవెక్‌ అనే ప్రాంతానికి బయలుదేరింది. అక్కడి అణు కేంద్రాన్ని, మూతబడిన బొగ్గు కర్మాగారాన్ని ఇది భర్తీ చేయనుంది. ఎప్పుడు మంచుతో కప్పి ఉండే సంప్రదాయక అణు కేంద్రాలకు ఇలాంటి తేలియాడే రియాక్టర్లు మంచి ప్రత్యామ్నాయమని అణు పరిశోధన సంస్థ రొసాటోం పేర్కొంది. వీటిని ఇతర దేశాలకు అమ్మే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది.

కాగా ఈ తేలియాడే అణు రియాక్టర్లు మంచుపై ఉండే చెర్నోబిల్‌ లాంటివని, అణు బాంబుపూరిత టైటానిక్‌ లాంటివని, వీటితో ప్రమాదముంటుందని ఎన్నో పర్యావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ రియాక్టర్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని రష్యా ఆలోచిస్తోంది. ముఖ్యంగా చమురు లభించే ప్రాంతాల్లో వీటిని వినియోగించనుంది. (చదవండి: మళ్లీ అణ్వాయుధ పోటీ!)

మరిన్ని వార్తలు