ఆస్ప‌త్రిలో చేరిన సౌదీ రాజు

20 Jul, 2020 10:30 IST|Sakshi

రియాద్‌: సౌదీ అరేబియా రాజు కింగ్ స‌ల్మాన్ బిన్ అబ్దులజీజ్(84) ఆస్ప‌త్రిలో చేరారు. పిత్తాశ‌యం వాపుతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న రాజ‌ధాని రియాద్‌లోని ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు స్థానిక వార్తా సంస్థ సోమ‌వారం వెల్ల‌డించింది. రాజు స‌ల్మాన్ సుమారు రెండున్న‌ర సంవ‌త్స‌రాల పాటు డిప్యూటీ ప్రీమియ‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 50 సంవ‌త్స‌రాలకు పైగా రియాద్ ప్రాంతానికి గ‌వ‌ర్న‌ర్‌గా పని చేశారు. 2012లో యువ‌రాజుగా, 2015లో సౌదీ రాజుగా రాజ్యాధికారం చేప‌ట్టారు. అయితే 2016లో ఆయ‌న కొడుకు మ‌హ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్‌ను యువ‌రాజుగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచీ సౌదీకి వాస్త‌వ ప‌రిపాల‌కుడు ఆయ‌నేన‌ని ప‌రిగ‌ణిస్తున్నారు.

మ‌హమ్మ‌ద్ బిన్ స‌ల్మాన్‌.. దేశంలో అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు కార‌ణ‌మ‌య్యారు. అలాగే 2017లో సౌదీ రాజు కుటుంబాన్ని నిర్బంధించి వివాదాస్ప‌ద నాయ‌కుడిగానూ ముద్ర వేసుకున్నారు. జ‌ర్న‌లిస్ట్ ఖ‌షోగ్గీని హ‌త్య చేయించారన్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. అలాగే సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అధికారులు ముగ్గురు యువరాజులను అరెస్ట్‌ చేశారు. రాజు సల్మాన్‌ తమ్ముడు అహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్, దగ్గరి బంధువు మహమ్మద్‌ బిన్‌ నయేఫ్‌లు ఇందులో ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. (మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా)

మరిన్ని వార్తలు