కోవిడ్‌కు మందు కనుగొన్నాం

1 Apr, 2020 20:15 IST|Sakshi

ప్రకటించిన అమెరికా డాక్టర్‌

కాలిఫోర్నియా: కరోనా వైరస్‌ బాధితులను రక్షించేందుకు మందు కనిపెట్టామని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్‌ జాకబ్‌ గ్లాన్‌విల్లె ప్రకటించారు. సార్స్‌ వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించిన ‘యాంటీ బాడీస్‌’నే ఉపయోగించి తన బృందం కరోనా వైరస్‌పై విజయం సాధించిందని ‘డిస్ట్రిబ్యూటెడ్‌ బయో’ ల్యాబ్‌కు సీఈవోగా వ్యహరిస్తున్న ఆయన చెప్పారు. ఐదుగురుతో కూడిన తన బృందం ఐదు యాంటీ బాడీస్‌ను తీసుకొని లోతుగా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. సార్స్‌ను నిర్వీర్యంచేసే యాంటీ బాడీస్‌తోనే తమ ప్రయోగం ఫలించిందని పాండిమిక్‌ నెట్‌ఫ్లిక్స్‌ తీసిన డాక్యుమెంటరీలో కనిపించిన డాక్టర్‌ జాకబ్‌ వివరించారు.

మానవుడి శరీరంలోని కరోనా వైరస్‌ ఎస్‌–ప్రొటీన్‌ కణాల ద్వారా ప్రవేశిస్తుందని, తాము ఉపయోగించిన యాంటీ బాడీస్, ఎస్‌–ప్రొటీన్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా కరోనా వైరస్‌ను నాశనం చేసిందని డాక్టర్‌ జాకబ్‌ తెలిపారు. దీనిపై మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకొని మందు అందుబాటులోకి సెప్టెంబర్‌ నెలలో రావచ్చని ఆయన చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలను తాము ముమ్మరం చేశామని ఆయన చెప్పారు. మరో రెండు లాబొరేటరీల సాయంతో తాము చేసిన ప్రయోగ ఫలితాలను నిర్ధారించుకుంటున్నామని తెలిపారు. జాకబ్‌ గ్లాన్‌విల్లె బృందం ప్రయోగం ఫలిస్తే కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ మానవాళికి రక్షణ లభిస్తుంది. (చదవండి: కరోనా: చైనాలో డాక్టర్‌ అదృశ్యం, కలకలం)

మరిన్ని వార్తలు