వామ్మో సెప్సిస్‌..!

18 Jan, 2020 04:11 IST|Sakshi

ప్రతీ అయిదుగురిలో ఒకరు మృతి

లాన్సెట్‌ నివేదిక వెల్లడి

వాషింగ్టన్‌: సెప్సిస్‌.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? రక్తానికి ఇన్‌ఫెక్షన్‌ సోకడం. శరీరంలో ప్రవహించే రక్తం అంతా కలుషితమైపోయి రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో మనిషి కుంగి కృశించిపోవడం. ఇప్పుడు ఈ జబ్బు ప్రాణాంతకంగా మారింది. ఇది సోకిందంటే శరీరం అంతా కుళ్లిపోయి మనిషి ప్రాణాలను తోడేస్తుంది. గతంలో కంటే సెప్సిస్‌ సోకిన మృతులు రెట్టింపు అయ్యాయని లాన్సెట్‌ జర్నల్‌ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. సెప్సిస్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన ప్రతీ అయిదుగురిలో ఒకరు మృత్యువాత పడుతున్నారని పిట్స్‌బర్గ్‌ వర్సిటీ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.

2017లో ప్రపంచవ్యాప్తంగా సెప్సిస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 1.1 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయినట్టు లాన్సెట్‌ జర్నల్‌ నివేదికలో వెల్లడించింది. సెప్సిస్‌ సోకిన వారిలో ప్రాణాలతో బతికి బయటపడ్డా, జీవితాంతం మంచానికి అతుక్కుపోయే పరిస్థితి కూడా వస్తుందని అధ్యయనకారులు వెల్లడించారు. సెప్సిస్‌ పురుషుల్లో కంటే మహిళలకే అధికంగా సోకుతుంది. 2017 సంవత్సరంలో అత్యధికంగా నిరుపేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సెప్సిస్‌ కేసులు 85 శాతం వరకు నమోదుకాగా, ఇందులో ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోనివే ఎక్కువ. 40 శాతం కంటే ఎక్కువ కేసులు అయిదేళ్లలోపు పిల్లల్లో కనిపిస్తున్నాయని వాషింగ్టన్‌ స్కూలు ఆఫ్‌ మెడిసన్‌ ప్రొఫెసర్‌ మోహెసన్‌ నఘావి అన్నారు.

మరిన్ని వార్తలు