ఒక్క రోజులోనే కోటీశ్వరురాలైంది!

22 Jan, 2016 11:56 IST|Sakshi
ఒక్క రోజులోనే కోటీశ్వరురాలైంది!

సెర్బియాకు చెందని ఓ వృద్ధురాలు ఒక్క రోజులోనే కోటీశ్వరురాలు అయ్యింది. దాదాపు 6.70 కోట్ల రూపాయల నగదు, 27 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దక్కాయి.

సెర్బియా తూర్పు ప్రాంతంలో మేరీ జ్లాటిక్ (86) కొన్ని దశాబ్దాలుగా ఓ చిన్న గుడిసెలో ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు కుక్కలు మాత్రమే తోడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే 6700 రూపాయల పెన్షనే ఆమెకు జీవనాధారం. మేరీ జ్లాటిక్కు చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న ఆమె భర్త మొమ్కిలో జ్లాటిక్ 2011లో ఆస్ట్రేలియాలో మరణించాడు. మొమ్కిలో సంపద ఆయన వారసత్వంగా మేరీకి దక్కింది. కాగా కోర్టులో కేసు పరిష్కారమై డాక్యుమెంట్లు చేతికి రావడానికి నాలుగేళ్లు పట్టింది.

జ్లాటిక్ దంపతులు 1956లో సెర్బియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. మొమ్కిలో ఓ కంపెనీలో కార్పెంటర్గా పనిచేసేవాడు. మేరీ కొంతకాలం ఆస్ట్రేలియాలో గడిపిన తర్వాత తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సొంతూరు సెర్బియాలోని బొల్జెవక్ పట్టణానికి తిరిగి వచ్చింది. తల్లి మరణించిన తర్వాత ఆమె మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. ఆస్ట్రేలియాలో ఉండే ఆమె భర్త మరో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మేరీకి తన భర్తతో సంబంధాలు తెగిపోయాయి. నాలుగేళ్ల క్రితం మొమ్కిలో మరణవార్త విని ఓ వ్యక్తి మేరీకి సాయపడ్డాడు. మొమ్కిలో దాచిన డబ్బు, సంపద ఆమెకు దక్కింది. కోట్ల రూపాయల సంపద దక్కినా మేరీ మాత్రం తన చిన్న గుడిసెలోనే ఉంటానని చెబుతోంది.
 

మరిన్ని వార్తలు