ఆర్టికల్‌ 370 రద్దు: స్పందించిన అఫ్రిది

6 Aug, 2019 10:31 IST|Sakshi

కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు

డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలి: అఫ్రిది

ఇస్లామాబాద్‌: జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత ప్రభుత్వ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. అసలు ఐరాస‌ను ఎందుకు ఏర్పాటు చేశారు? ఇంత జరుగుతున్నా ఎందుకలా నిద్రపోతోంది. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఐరాస ఎందుకు స్పందించట్లేదు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి’ అంటూ ట్వీటర్‌లో అభిప్రాయపడ్డారు.
చదవండి: ఆర్టికల్‌ 370 రద్దు
చదవండి: త్రిమూర్తులు... ఎంఎస్‌డీ

అలాగే దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలని అఫ్రిది కోరారు. సదరు ట్వీట్‌ను ఐక్యరాజ్యసమితి, డొనాల్డ్ ట్రంప్‌కు ట్యాగ్ చేశారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌పై భారత ప్రభుత్వ చర్యపై పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇదివరకే ఖండించింది. ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని తెలిపింది. కశ్మీరీలకు మద్దతు కొనసాగిస్తామని పేర్కొంది. తాజా పరిణామంతో రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. భారత్‌ ప్రకటన ఐరాస తీర్మానాలకు వ్యతిరేకమని అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ పేర్కొన్నారు.

చదవండి: హిందూ రాజు ముస్లిం రాజ్యం
చదవండి: నాలుగు యుద్ధాలు

మరిన్ని వార్తలు