ఇస్లామాబాద్: పాకిస్థాన్కు కొత్త ప్రధాని వచ్చారు. మంగళవారం షాహిద్ ఖాఖన్ అబ్బాసీని పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ తమ కొత్త ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు 342 సభ్యులున్న అసెంబ్లీలో 221మంది అబ్సాసీకి ఓటు వేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన నవీద్ ఖమర్కు 47 ఓట్లు రాగా, పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్షాప్కు 33 ఓట్లు, జమాతే ఇ ఇస్లామికి చెందిన సహిబ్జాదా తారీఖుల్లాకు రెండే ఓట్లు వచ్చాయి. ఫలితాలు వెల్లడించగానే సభలో పలువురు నినాదాలు చేస్తుండగా నేషనల్ స్పీకర్ అయాజ్ సాదిక్ అబ్బాసీని ప్రధాని పదవిని అలంకరించాలని ఆహ్వానించారు.
అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. పనామా కుంభకోణం కేసులో దోషిగా ప్రకటిస్తూ పాకిస్థాన్ ప్రధానిగా పనిచేస్తున్న నవాజ్ షరీఫ్పై అనూహ్యంగా సుప్రీంకోర్టు వేటువేసిన విషయం తెలిసిందే. దీంతో నవాజ్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా ఆయన అనంతరం ప్రధానిగా వచ్చే వ్యక్తికోసం ప్రత్యేకంగా జాతీయ అసెంబ్లీలో నాలుగుచోట్ల ఏర్పాటుచేసిన ప్రత్యేకచోట్లలో ఓటింగ్ నిర్వహించారు. అయితే, ఓటింగ్ నిర్వహించే సమయంలో షరీఫ్ మద్దతుదారులు ఆయన ఫొటోలతో లోపలికి ప్రవేశించి ఆందోళన చేసే ప్రయత్నం చేయగా స్పీకర్ జోక్యం చేసుకొని వారిని మార్షల్స్ ద్వారా అడ్డుకున్నారు.