సాక్షి, చెన్నై: సింగపూర్కు చెందిన ప్రయివేటు విమానం ఒకటి అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరుచ్చిరాపల్లి నుంచి సింగపూర్ బయలుదేరిన టిఆర్ 567 స్కూట్ విమానం ఇంజీన్లో మంటలు, పొగ వ్యాపించడాన్ని పైలట్ గమనించారు. దీంతో కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్ అధికారులు అనుమతితో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
సిబ్బంది సహా 170 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు నిపుణులు విమానాన్ని పరిశీలిస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సాయంత్రానికి ఈ విమానం తిరిగి సింగపూర్ బయలు దేరనుందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు తగిన వసతి సదుపాయాలను కల్పించినట్టు అధికారులు తెలిపారు.