10 మంది భార‌తీయుల‌పై సింగ‌పూర్ వేటు

13 Jul, 2020 17:51 IST|Sakshi

కోవిడ్ నిబంధ‌న‌ల అతిక్ర‌మ‌ణ‌ల‌పై సింగ‌పూర్ కొర‌డా

సింగ‌పూర్: కోవిడ్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం సింగ‌పూర్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఏ ఒక్క‌రు కోవిడ్ నిబంధ‌న‌ల(స‌ర్క్యూట్ బ్రేక‌ర్‌)‌ను అతిక్ర‌మించినా వారికి భారీ స్థాయిలో జ‌రిమానా విధించ‌డంతోపాటు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు వెనుకాడ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఉండే కొంత‌మంది‌ భార‌తీయులపై సింగ‌పూర్ ప్ర‌భుత్వం క‌న్నెర్ర జేసింది. స‌ర్క్యూట్ బ్రేక‌ర్ ఉల్లంఘించిన‌ ప‌దిమంది భార‌తీయుల‌ను బ‌హిష్క‌రించిన‌ట్లు సోమ‌వారం అక్క‌డి ప్రభుత్వం వెల్ల‌డించింది. వారి పాసుల‌ను సైతం ర‌ద్దు చేశామ‌ని తెలిపింది భవిష్య‌త్తులోనూ వారు త‌మ దేశంలోకి వ‌చ్చేందుకు అనుమ‌తించ‌బోమ‌ని తేల్చి చెప్పింది. వీరిలో ఉపాధి కోసం వ‌చ్చిన‌వారితో పాటు విద్యార్థులు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. జూన్‌-జూలై నెల‌లోనే వీరు స్వ‌దేశానికి చేరుకున్నారు. (సింగపూర్‌లో ఉపాధ్యాయుడి వికృత చేష్టలు)

మే 5న ఓ ఇంటిలో 10 మంది భార‌తీయులు గుమిగూడ‌టంతో సింగ‌పూర్ పోలీసులు ప‌ట్టుకున్నారు. గుంపులుగా గుమిగూడి కోవిడ్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించార‌ని 2 వేల నుంచి 4500 సింగ‌పూర్ డాల‌ర్ల వ‌ర‌కు జ‌రిమానా సైతం విధించారు. తాజాగా వారిని మ‌రోసారి దేశంలోకి అనుమ‌తించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో సింగ‌పూర్ ఏప్రిల్ 7న 'స‌ర్క్యూట్ బ్రేక‌ర్' నిబంధ‌న‌ను అమల్లోకి తెచ్చింది. దీని ప్ర‌కారం అక్క‌డి ప్ర‌జ‌లు నిత్యావ‌స‌రాల‌కు మాత్ర‌మే బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఉంటుంది. ఈ నిబంధ‌న‌ తొలి ద‌శ జూన్ 2తో ముగిసింది. సోమ‌వారం నుంచి రెండో ద‌శ ప్రారంభం కాగా.. ఇందులో వ్యాపార స‌ముదాయాల‌కు మ‌రిన్ని స‌డ‌లింపులు ఇచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు సింగ‌పూర్‌లో 45,961 కేసులు న‌మోద‌వ‌గా, 26 మంది మ‌ర‌ణించారు. (మాస్క్ పెట్టుకోమ‌న్నందుకు ప్రాణం తీశారు)

మరిన్ని వార్తలు