అమెరికా, చైనా, భారత్‌ ఎంత ఖర్చు చేశాయంటే..

27 Apr, 2020 14:11 IST|Sakshi

మిలిటరీ వ్యయం: ఆ ఐదు దేశాలదే సింహభాగం

స్టాక్‌హోం: రక్షణ పరికరాలు, యుద్ధ సామాగ్రి కొనుగోలు తదితర మిలిటరీ కార్యకలాపాలకై ప్రపంచదేశాలు 2019 ఏడాదికి గానూ 1917 బిలియన్‌ డాలర్లు వెచ్చించినట్లు ది స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ(ఎస్‌ఐపీఆర్‌ఐ) పేర్కొంది. సైన్యం కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసిన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా ఆసియా దేశాలు చైనా, భారత్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయని వెల్లడించింది. 2018తో పోలిస్తే చైనా 2019లో మిలిటరీ మీద ఖర్చు చేసిన వ్యయం 5.1 శాతం పెరగగా.. చైనా, పాకిస్తాన్‌ దేశాల సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్‌ 6.8 శాతం ఎక్కువగా ఖర్చు చేసిందని నివేదికలో తెలిపింది. గతేడాది చైనా మొత్తంగా సైన్యం మీద 261 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయగా... భారత్‌ 71.1 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. (హ్యుమన్‌ ట్రయల్స్‌.. నేను బతికే ఉన్నా)

ఇక అగ్రరాజ్యం అమెరికా 732 బిలియన్‌ డాలర్లు సైనిక వ్యవస్థ కోసం ఖర్చు చేసిందని ఎస్‌ఐపీఆర్‌ఐ తెలిపింది. ఈ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో అమెరికా, చైనా, భారత్‌, రష్యా, సౌదీ అరేబియా నిలిచాయని... ప్రపంచ దేశాలు సైన్యం మీద ఖర్చు చేసిన మొత్తంలో సింహ భాగం ఈ దేశాలదేనని పేర్కొంది. ఈ ఐదు దేశాలు కలిపి మొత్తంగా 62 శాతం నిధులు రక్షణ వ్యవస్థ కోసం వెచ్చించాయని తెలిపింది. ఇక జపాన్‌ 47.6 బిలియన్ డాలర్లు‌, దక్షిణ కొరియా 43.9బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకున్నాయని వెల్లడించింది. అయితే 2020లో కరోనా సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఈ ఏడాది సైన్యం మీద ఖర్చు చేసే మొత్తం తక్కువగానే ఉండవచ్చని ఎస్‌ఐపీఆర్‌ఐ అంచనా వేసింది.(కిమ్‌ బతికే ఉన్నాడు!)

మరిన్ని వార్తలు