సాక్షి : ఓవైపు వరుస ఉగ్రదాడులతో వణికిపోతున్న లండన్ నగరంలో మళ్లీ ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ షాపింగ్ మాల్లో గుర్తుతెలియని దుండగులు యాసిడ్ దాడికి పాల్పడగా 6 గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి ఈస్ట్ లండన్ న్యూహమ్లో ఘటన చోటు చేసుకుంది.
రాత్రి 8 గంటల సమయంలో స్ట్రార్ట్ఫోర్ట్ షాపింగ్ సెంటర్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు షాపింగ్కు వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. యాసిడ్ జల్లే ముందు వారు అక్కడే ఉన్న గుంపుతో వాగ్వాదానికి దిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం ద్వారా తెలుస్తోంది. ఆ మంటను భరించలేక పక్కనే ఉన్న టాయ్లెట్లోకి వెళ్లి చాలా మంది ముఖాలు కడుక్కున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఇక ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ధృవీకరించారు. కాగా, ఇది ఉగ్రవాద చర్య అయి ఉండకపోవచ్చనే వారంటున్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తంగా కాగా, వాటి ద్వారా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు చెప్పారు.