కిమ్‌ ఎక్కడున్నారో తెలుసు: దక్షిణ కొరియా

28 Apr, 2020 14:35 IST|Sakshi

సియోల్‌: మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఏప్రిల్‌ 15 నాటి కార్యక్రమానికి హాజరుకాకపోయి ఉండవచ్చని దక్షిణ కొరియా పేర్కొంది. కిమ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగా దాయాది దేశం నుంచి ఎటువంటి సంకేతాలు వెలువడటం లేదని మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర కొరియా వ్యవహారాల శాఖా మంత్రి ​కిమ్‌ యోన్‌ చౌల్‌ మంగళవారం పార్లమెంటు సెషన్‌లో మాట్లాడుతూ.. ‘‘అధికారం చేపట్టిన నాటి నుంచి కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి ఉత్సవాలకు ఒక్కసారి కూడా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గైర్హాజరు కాలేదన్నది వాస్తవం. అయితే కరోనా భయాల నేపథ్యంలో సామూహిక వేడుకలను రద్దు చేసిన విషయం తెలిసిందే కదా. జనవరి మూడో వారం నుంచి అప్పుడప్పుడు కిమ్‌ ఇలా మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే కిమ్‌ జోంగ్‌ ఎక్కడ ఉన్నారో ప్రభుత్వాని(సౌత్‌ కొరియా)కి తెలుసు’ ’అని వ్యాఖ్యానించారు. (కిమ్‌ చెల్లెలు మరింత క్రూరంగా ఉంటే..)

ఇక విదేశాంగ మంత్రి కాంగ్‌ యాంగ్‌ వా .. కిమ్‌‌ ఆరోగ్య పరిస్థితి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు తెలుసునని.. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న విషయం మాత్రం తెలిసే అవకాశం లేదన్నారు. కాగా ట్రంప్‌ సోమవారం నాటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కిమ్‌ జోంగ్‌ ఆరోగ్యంగానే ఉన్నారని భావిస్తున్నామని తెలిపారు. జపాన్‌ ప్రధాని షింజో అబే సైతం ఈ విషయంపై స్పందించారు. ఉత్తర కొరియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచమంతా కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వేళ తమ దేశంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా మీడియా పేర్కొన్న విషయం తెలిసిందే. (ఆ రైలు అదే.. కిమ్‌ అక్కడే ఉండొచ్చు!)

ఇక ప్రస్తుతం దక్షిణ కొరియా అధికారుల వ్యాఖ్యల్ని బట్టి ఒకవేళ కిమ్‌ నిజంగానే కరోనా భయంతో దాక్కుంటే.. స్థానిక మీడియా నవ్వులపాలవుతుందని కొరియా రిస్క్‌ గ్రూప్‌ సీఈఓ చాద్‌ ఓకారొల్‌ పేర్కొన్నారు. ఆయన నిజంగానే ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా దూరంగా ఉండాలనుకుంటే ఆరోగ్యంగా ఉన్న కిమ్‌ ఫొటోలు, వీడియోలు విడుదల చేసి వదంతులకు చెక్‌పెట్టవచ్చు కదా అని పేర్కొన్నారు. కాగా కిమ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. ఆయన స్థానంలో సోదరి కిమ్‌ యో జాంగ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారని వార్తలు ప్రచారమవుతున్న విషయం తెలిసిందే.(మా వద్ద ఆ సమాచారం లేదు: చైనా)

మరిన్ని వార్తలు