ఉడత పచ్చి మాంసం తింటూ వీరంగం!

24 Jul, 2019 18:20 IST|Sakshi

లండన్‌: డియోనిసి ఖ్లేబ్నికోవ్ , గాటిస్ లాగ్డిన్స్ అనే ఇద్దరు వ్యక్తులు చనిపోయిన ఉడత పచ్చి మాంసాన్ని బహిరంగంగా తినడంతో కలకలం రేగింది. లండన్‌లోని ఓ శాఖాహార మర్కెట్‌ ముందు ఉడత మాంసాన్ని తిన్న వీడియోను గాటిస్‌ లాగ్డిన్స్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో  పోస్ట్‌ చేశాడు. వీడియో ప్రకారం.. బహిరంగంగా ఉడతను తినే క్రమంలో చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు తినవద్దంటూ.. ఎంత వారించినా వారు వినకుండా వీరంగం సృష్టించారు. ఈ ఉడత మాంసం వాసన ఎలా ఉందని అడుగుతూ.. రోడ్డుపై వెళ్లేవారిని ఇబ్బందిపెట్టారు.

ఈ క్రమంలో ఓ వ్యక్తి పచ్చి మాంసం ఎందుకు తింటున్నారంటూ ప్రశ్నించగా.. ఉడికించుకొని తింటే పోషక విలువలు లభించవని సమాధానమిచ్చారు. కాగా న్యూసెన్స్‌ చేస్తున్న వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని.. కోర్టులో హాజరుపరచారు. ఈ క్రమంలో ‘ శాఖాహారానికి వ్యతిరేకంగా మాంసాహారం తినాలని అవగాహన కల్పించడానికి, ఇలా ఉడత పచ్చి మాంసం తిన్నామని వారు కోర్టుకు తెలిపారు. దీంతో బహిరంగంగా ఉడత మాంసం తినటం, పలువురుకి ఇబ్బంది కలిగించడాన్ని నేరంగా పేర్కొన్న కోర్టు వారికి 200 పౌండ్ల జరిమానా విధించింది. అయినా ప్రవర్తన మార్చుకోకుండా వారు తదుపరి విచారణకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో కోర్టు వారికి మరో 400 పౌండ్లు జరిమానా విధించింది.  

మరిన్ని వార్తలు