మరోసారి సోషల్‌ మీడియాపై తాత్కాలిక నిషేధం

13 May, 2019 08:28 IST|Sakshi

కొలంబో: హింసాత్మక ఘటనల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్తగా సామాజిక మాధ్యమాలను అక్కడి ప్రభుత్వం సోమవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర మెసేజింగ్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈస్టర్‌ దాడులు తరువాతముస్లిం​లకు సంబంధించిన వ్యాపార సముదాయాలు, ముసీదులు రాళ్లు రువ్వడం తోపాటు, ఒక వ్యక్తిపై దాడిలాంటి తాజా ఘటనల నేపథ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.  ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా ఈ వివాదం రాజుకుందని  అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో  వివాదాస్పద పోస్ట్‌ పెట్టిన అబ్దుల్‌ హమీద్‌ అన్సారీ(38)ని  అరెస్టు చేశారు.

మరోవైపు ఈస్టర్‌ దాడుల్లో  కీలక వ్యక్తిగా అనుమానిస్తున్న జహ్రాన్ హషీంతో సంబంధాలున్న సౌదీ అరేబియా మతబోధకుడు మొహమ్మద్ అలియార్‌(60) ను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యావేత్త, అయిన అలియార్..సెంటర్ ఫర్ ఇస్లామిక్ గైడెన్స్ వ్యవస్థాపకుడు. అయితే ఈ సంస్థ ఆధ్వర్యంలో జహ్రాన్.. సొంత పట్టణమైన కట్టంకుడిలో మసీదు, మత పాఠశాల, లైబ్రరీని అలియార్ స్థాపించాడు. అలియార్‌కు జహ్రాన్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించినట్టు తమకు సమాచారం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, పోలీసులు పూర్తి వివరాలందించేందుకు నిరాకరించారు. 

కాగా ఏప్రిల్‌ 21, ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడుల్లో  257 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశంలో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉన్నందున సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. అయితే ఆ నిషేధాన్ని ఏప్రిల్‌ 30న ఎత్తివేశారు. తాజా నిర్ణయంతో దీంతో శ్రీలంకలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, వైబర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి యాప్‌ల సేవలు శ్రీలంక వాసులకు మరికొన్ని రోజులు దూరం కానున్నాయి.

మరిన్ని వార్తలు