రానున్న ఐదేళ్లలో నిరూపిస్తామంటున్న శ్రీలంక

1 Aug, 2019 11:34 IST|Sakshi

కొలంబో: చరిత్రలో మొట్టమొదటి వైమానికుడు రావణాసురుడేనట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 5వేల ఏళ్ల క్రితమే రావణాసురుడు విమానంలో గగనతలంలో విహరించాడని.. రానున్ను ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపిస్తామని అంటున్నారు శ్రీలంక వైమానిక అధికారులు. ఈ విషయం గురించి శ్రీలంక సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ శశి దానతుంగే న్యూస్‌18తో ఫోన్‌లో మాట్లాడారు. ‘చరిత్రలో విమానాన్ని ఉపయోగించి గగనతలంలో విహరించిన తొలి వైమానికుడు రావణుడే. పురాణాల ఆధారంగా ఈ విషయం చెప్పడం లేదు. ఈ విషయంలో పూర్తి స్థాయి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. వచ్చే ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపిస్తాం’ అన్నారు.

కటునాయకేలో ఉన్న బండారునాయకే విమానాశ్రయంలో బుధవారం శ్రీలంక పౌర విమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే రావణుడు శ్రీలంక నుంచి నేటి భారతదేశానికి వెళ్లి తిరిగి వచ్చాడని ఈ సమావేశం తేల్చింది. రానున్న ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపించాలని నిర్ణయించింది. అంతేకాక శ్రీలంకలో రావణుడిని గొప్ప రాజుగా.. దయ గల మనిషిగా చెప్పుకుంటారు. సీతా దేవిని అపహరించాడు, రాక్షసుడు అనే అంశాన్ని అక్కడి ప్రజలు ఒప్పుకోరు. అది కేవలం భారతీయుల వాదనగా కొట్టి పారేస్తారు. కొద్ది రోజుల క్రితం శ్రీలంక అంతరిక్షంలోకి పంపిన ఓ ఉగప్రహానికి రావణ అనే పేరు పెట్టింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆ దేశ ప్రజలు రావణుడికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో.

మరిన్ని వార్తలు