నిన్న జుకర్ బర్గ్, నేడు సుందర్ పిచాయ్

12 Dec, 2015 14:24 IST|Sakshi

నిన్న ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్... తాజాగా గూగుల్ సీఈవో  భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ముస్లింలకు బాసటగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం, మైనార్టీ వర్గాలకు తాము మద్దతుగా ఉంటామని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.  అమెరికాలోకి రాకుండా ముస్లింలను బ్యాన్ చేయాలని రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో  గూగుల్ సీఈవో పై విధంగా స్పందించారు. ఆ వ్యాఖ్యలు సరికాదని, అసహనంపై వస్తున్న వార్తలు బాధాకరమని సుందర్ పిచాయ్ 'మీడియం'లో పోస్ట్  చేశారు.

ఈ సందర్భంగా సుందర్ పిచాయ్...తాను భారత్ నుంచి అమెరికా వచ్చిన రోజులను గుర్తు చేస్తున్నారు.22 ఏళ్ల క్రితం భారత్ నుంచి యూఎస్ వచ్చానని, తనను అవకాశాల భూమి అమెరికా అక్కున చేర్చుకుందని తెలిపారు. ఇక్కడకు వచ్చిన తనలాంటి వారికి కేవలం అవకాశాలు మాత్రమే కాకుండా విశాలమైన హృదయంతో, సహనంతో అమెరికా తనలో ఒక భాగం చేసుకుందని తెలిపారు. అమెరికాను కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్గా పిచాయ్ పేర్కొన్నారు. ఏదైనా ఒక దేశం లేదా సంస్థ అభివృద్ధి పథంలో పయనించాలంటే అక్కడ భిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తులు, సంస్కృతులు ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
 

>
మరిన్ని వార్తలు