నాసా టీమ్‌లో సునీతా విలియమ్స్‌

4 Aug, 2018 08:42 IST|Sakshi

హూస్టన్‌: అగ్రరాజ్యం అమెరికా దాదాపు ఏడేళ్ల తర్వాత 2019లో మానవ సహిత అంతరిక్ష యాత్రలను చేపట్టనుంది. ఇందులో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ సహా 9 మంది ఆస్ట్రోనాట్స్‌ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ప్రైవేటు కంపెనీ బోయింగ్‌ రూపొందించిన సీఎస్‌టీ–100 స్టార్‌ లైనర్, స్పేస్‌ ఎక్స్‌ అభివృద్ధి చేసిన డ్రాగన్‌ క్యాప్సూల్స్‌ ద్వారా వీరిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్‌)కి వచ్చే ఏడాది ఆరంభంలో చేర్చనున్నారు. ఈ రెండు కంపెనీలు నాసా సహకారంతో ఈ అంతరిక్ష నౌకల్ని అభివృద్ధి చేశాయి. ఈ వివరాలను శుక్రవారం నాడిక్కడ నిర్వహించిన ఓ సమావేశంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాముల్ని, ఆహారపదార్థాలను చేరవేయనున్నారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టేముందు బోయింగ్, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు తమ నౌకల్ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నాయి. అలాగే ప్రమాద సమయంలో వ్యోమగాములు రాకెట్‌ నుంచి సురక్షితంగా బయటపడేసే అబార్ట్‌ వ్యవస్థ సమర్థతను కూడా ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పరీక్షిస్తారు. 1972, జనవరి 5న మొదలైన స్పేస్‌ షటిల్‌ కార్యక్రమం 2011 నాటికి ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసా సరికొత్త అంతరిక్ష వాహక నౌకల అభివృద్ధిపై దృష్టి సారించింది. 

మరిన్ని వార్తలు