స్వీడన్‌లో కరోనా మృతుల శాతం ఎక్కువ!

21 May, 2020 15:30 IST|Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచంలోనే అత్యధికంగా స్వీడన్లు ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడి మరణిస్తున్నారు. మే 13వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు కరోనా వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్యను పరిగణలోకి తీసుకొని విశ్లేషించగా ప్రతి పది లక్షల మందిలో 6.08 మంది చొప్పున మరణిస్తున్నారు. ఇలా మరణాల సంఖ్య బ్రిటన్‌లో 5.57, బెల్జియంలో 4.28, అమెరికాలో 4.11, ఇటలీలో 2.97, స్పెయిన్‌లో 2.62 మరణాలు చోటు చేసుకున్నాయి. అయితే మృతుల సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే స్వీడన్‌ కన్నా ఎక్కువ అమెరికాలోనే సంభవించాయి.

ఒక్క బుధవారం నాడే ప్రపంచవ్యాప్తంగా 1,06,000 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకిన వారు 51 లక్షలు దాటగా, మరణించిన వారి సంఖ్య మూడు లక్షల 30 వేలను దాటింది. అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 15 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 95 వేలకు చేరుకుంది. బ్రిటన్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య రెండున్నర లక్షలు దాటగా, మృతుల సంఖ్య 35వేలను దాటింది. అదే స్వీడన్‌లో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 31 వేలు దాటగా, మృతుల సంఖ్య 4 వేలకు దగ్గరలో ఉంది. (ప్రపంచంపై కరోనా పంజా)

మరిన్ని వార్తలు