స్విట్జర్లాండ్‌లోనే మొదటి సారిగా ‘ఈ టిక్కెట్లు’ 

24 Sep, 2019 19:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ బస్సుల్లో, మెట్రో రైళ్లలో ప్రయాణించేవారు తమ తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు ముందుగానే టిక్కెట్లు తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఇదే విధానం ఇంతకాలం కొనసాగుతూ వచ్చింది. ఆటోలకు, క్యాబీలకు మాత్రమే ఎంతైందని లెక్కించి గమ్య స్థానాలకు చేరుకున్నాక చార్జీలు చెల్లిస్తాం. క్యాబుల్లాగా ఎందుకు గమ్యస్థానాలకు చేరుకున్నాకే చార్జీలు వసూలు చేయకూడదు! అని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం భావించేదేమోగానీ ప్రయాణికులు దిగేటప్పుడు చార్జీలు వసూలు చేసే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ ఆటోమేటిక్‌ టిక్కెటింగ్‌ వ్యవస్థను తాము ప్రయోగాత్మకంగా 2018లోనే ప్రవేశపెట్టామని, ఇప్పటికీ ఈ వ్యవస్థలో 90 వేల మంది ప్రయాణికులు చేరారని, 2020 జనవరి నెల నుంచి ప్రయాణికులందరికి ఈ వ్యవస్థనే ప్రవేశపెడతామని ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సిల్వియా కండేరా మీడియాకు తెలియజేశారు. 

ప్రపంచంలో ఓ ప్రభుత్వ రవాణా వ్యవస్థలో ఇలా ఆటోమేటిక్‌ టిక్కెట్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఏకైక దేశం ఇప్పటికీ స్విట్జర్లాండే. దీని వల్ల ప్రయాణికులుగానీ, కండక్టర్‌గానీ చిల్లర కోసం వెతుక్కోనక్కర్లేదు. కాగితపు టిక్కెట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. యాప్‌ ద్వారా చార్జీలు ఎవరికి వెళ్లాలో వారికే వెళతాయి. మోసం చేయడానికి కూడా ఆస్కారం తక్కుతుంది. పైగా ప్రయాణికులు తాము దిగాల్సిన గమ్యస్థానాలను చివరి నిమిషంలో కూడా మార్చుకోవచ్చు. ఈ ఆటోమేటిక్‌ టిక్కెట్‌ వ్యవస్థ కోసం బీఎల్‌ఎస్, ఫేయిర్‌టిక్, ఎస్‌బీబీ, జూచర్, టీసీఎస్‌ అనే యాప్స్‌ను ప్రవేశపెట్టినట్లు సిల్వియా కండేరా వివరించారు. 

మరిన్ని వార్తలు