ముంబై దాడులు: తహవూర్‌ రాణా అరెస్ట్‌

20 Jun, 2020 12:03 IST|Sakshi

న్యూయార్క్‌ : 26/11 ముంబై దాడుల నిందితుడు తహవూర్‌ రాణాను అమెరికా పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. 2008లో జరిగిన ముంబై దాడులకు సంబంధించి చికాగో వ్యాపారవేత్త తహవూర్‌ రాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఉగ్రమూకలకు సహాయం చేసిన కేసులో ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది చికాగో కోర్టు. ఈ నేపథ్యంలో రాణా పది సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. ఆరోగ్య పరిస్థితులు క్షీణించటం, కరోనా వైరస్‌ సోకటంతో వారం రోజుల క్రితం అతడు జైలునుంచి విడుదలయ్యాడు. అయితే అతడ్ని అ‍ప్పగించాలని భారత్‌ కోరగా జైలునుంచి విడుదలైన రెండు రోజులకే జూన్‌ 10న లాస్‌ ఏంజిల్స్‌ పోలీసులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. భారత్‌- అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసిస్టెంట్‌ యూఎస్‌ అటార్నీ  జాన్‌ ఎల్‌ జూలెజియన్‌ పేర్కొన్నారు. ( కసబ్‌ను గుర్తుపట్టిన ఆ ‘హీరో’ ఫుట్‌పాత్‌పై.. )

కాగా, 2008 నవంబర్‌ 26న 10 మంది ఉగ్రవాదులు దేశ వాణిజ్య రాజధానిలో చొరబడి కాల్పులకు తెగబడిన ఘటనలో దాదాపు 166 మంది చనిపోయారు. ఈ మారణకాండకు కారణమైన ఉగ్రవాదుల్లో ప్రాణాలతో పట్టుబడింది కసబ్‌ మాత్రమే. ముంబై దాడుల కేసులో రాణాపై 2018లో ఎన్‌ఐఏ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 

మరిన్ని వార్తలు