ఆ దాడి చేసింది మేమే: తాలిబన్లు

13 Jul, 2020 21:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కారు బాంబుతో దాడి.. 10 మంది మృత్యువాత

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కారు బాంబుతో దాడి చేసి లోపలికి ప్రవేశించి భద్రతా బలగాలపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో సుమారు పది మంది మృత్యువాత పడ్డారు. ఉత్తర అఫ్గనిస్తాన్‌లోని సమంగన్‌ ప్రావిన్స్‌ రాజధాని ఐబక్‌లోని ప్రభుత్వ కార్యాలయం వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటలిజెన్స్‌ ప్రధాన విభాగమైన నేషనల్‌ సెక్యూరిటీ డైరెక్టరేట్‌పై దాడి జరిగిందని, కారు బాంబుతో ముష్కరులు విరుచుకుపడ్డారని ప్రభుత్వ అధికార ప్రతినిధి మహ్మద్‌ సెదిక్‌ అజీజీ తెలిపారు.

ఇక ఈ విషయం గురించి సమంగన్‌ గవర్నర్‌ అబ్దుల్‌ లతీఫ్‌ ఇబ్రహీమి మాట్లాడుతూ.. 10 మంది భద్రతా బలగాల సభ్యులు మరణించారని తెలిపారు. అంతేగాకుండా భద్రతా సిబ్బందితో పాటు సామాన్య పౌరులకు గాయాలయ్యాయని.. మొత్తంగా 54 మంది క్షతగాత్రులయ్యారని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్‌ సంస్థ ప్రకటించింది. (అఫ్గాన్‌‌లో ఆత్మాహుతి దాడి; ఏడుగురి మృతి)

కాగా దశాబ్దకాలంగా అఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అమెరికా తాలిబన్లతో ఈ ఏడాది శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని... అంతేగాక జైలు శిక్ష అనుభవిస్తున్న తాలిబన్లను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వానికి షరతు విధించింది. ఈ నేపథ్యంలో దశల వారీగా తాలిబన్లను విడుదల చేసేందుకు అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ మార్చిలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాలిబన్లు ఇటీవల వరుసగా ఉగ్రదాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆదివారం కుందుజ్‌ ప్రాన్స్‌లోని చెక్‌పాయింట్ల వద్ద దాడులకు తెగబడటంతో 14 మంది భద్రతా బలగాల సిబ్బంది మృతి చెందారు.

మరిన్ని వార్తలు