కాబూల్‌లో ఆత్మహుతి దాడి.. 10 మంది మృతి

5 Sep, 2019 16:00 IST|Sakshi

కాబూల్‌ : అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. గురువారం కాబూల్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో 10 మంది మృతిచెందగా, 42 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అఫ్గాన్‌ అధికారులు ధ్రువీకరించారు. అఫ్గాన్‌ ప్రభుత్వ కార్యాలయాలు, యూఎస్‌ ఎంబసీ సమీపంలోని చెక్‌పాయింట్‌ వద్ద ఈ దాడి జరిగింది. కాబూల్‌లో అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఈ దాడి జరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. భద్రత బలగాలు ఘటన స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు. విదేశీ బలగాలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అమెరికా సైన్యాలు అఫ్గాన్‌ విడిచి వెళ్లేందుకు, తాలిబన్లకు, యూఎస్‌ బలగాలకు మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్లు అఫ్గాన్‌లో ఇటువంటి దాడులకు పాల్పడటం గమనార్హం. ఈ వారంలో తాలిబన్లు జరిపిన రెండో దాడి ఇది. సోమవారం జరిగిన ఆత్మహుతి దాడిలో 16 మంది మృతి చెందగా, 100 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. 

మరిన్ని వార్తలు