అమెరికాలో తెలుగు యువకుడు అదృశ్యం

22 Jun, 2018 16:57 IST|Sakshi
పండు బంగారం, పుష్పలత దంపతులు, కుమారుడు రాఘవేందర్‌రావు

కొడుకు కోసం కన్నవారు కన్నీరు మున్నీరు

గత 8 నెలలుగా కుమారుడి ఆచూకి కోసం నిరీక్షణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి

సాక్షి, సైదాబాద్‌: కొడుకు ఉన్నత ఉద్యోగం చేస్తానంటే అప్పు చేసి మరి అమెరికా పంపించారు కన్నవారు. అయితే గత 8 నెలలుగా కొడుకు ఆచూకి లేకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు అమెరికాలోని కాలిఫోర్నియాలో అదృశ్యం కావడంతో వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు చంపాపేట సమీపంలోని వినయ్‌ నగర్‌ కాలనీలో శక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంద్రప్రదేశ్‌లోని ఈస్ట్‌గోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన పండు బంగారం, పుష్పలత దంపతులు ఉద్యోగ రిత్యా నగరానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో చిన్నతనంలోనే కర్నూల్‌లో మృతి చెందారు. దీంతో చిన్న కుమారుడు పి.రాఘవేందర్‌రావును ఎంతో గారాంభంగా పెంచారు. ఉన్నత చదువులు చదించారు. జెన్‌టీయులో బీటెక్‌, ఆ తరువాత లండన్‌లో 2010లో ఎంబీఏ చదివించారు.

రాఘవేందర్‌రావు 2011లో అమెరికా వెళ్లాడు. అక్కడి కాలిఫోర్నియాలోని మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌లో ప్రాజెక్ట్‌ మెనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ప్రతి రోజు రాఘవేందర్‌రావు తల్లిదండ్రులతో ఫోన్లో, వాట్సాప్‌ వీడియో కాల్‌ మాట్లాడేవారు. అయితే అక్టోబర్‌ 2017 నుంచి రాఘవేందర్‌ ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వస్తుంది. అప్పటి నుంచి నేటి వరకు కొడుకు ఆచూకి లభించడం లేదు. అతడి స్నేహితులను ఆరా తీసినా సరైన సమాచారం లేదు. దీంతో అప్పటి నుంచి కొడుకు ఆచూకి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ విషయంమై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించారు. సైదాబాద్‌ పోలీసులను సంప్రదించగా వారు ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు పంపించారు. ఒక్కగానొక్క కొడుకు ఎప్పటికైన తిరిగొస్తాడని దీనంగా ఎదురు చూస్తుంది ఆ కుంటుంబం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు