న్యూఢిల్లీ: పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించబోమని, తమ భూభాగంలో ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదులే లేరంటూ బుకాయిస్తూ వస్తున్న ఆ దేశానికి నోట్లో వెలగపండు ఇరికినట్లయింది. తమ ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలను వెంటనే ఖాళీ చేయించాలని, వాటి వల్ల తమ జీవితాలు నరకంలా మారాయని, వారి దుశ్చేష్టలు ఇక ఏమాత్రం సహించబోమంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ పౌరులు ఎదురు తిరిగారు. ఇస్లామాబాద్ వ్యతిరేక నినాదాలతో, పెద్దపెద్ద ప్లకార్డులతో ఆందోళన బాటపట్టారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్, కోట్లి, చినారి, మిర్పూర్, గిల్గిట్, దియామిర్, నీలం వ్యాలీ ప్రజలంతా గురువారం వీధుల్లోకి వచ్చి పాక్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అంతర్జాతీయ వేదికలపైనే, భారత్ తో గొడవలు జరుగుతున్న ప్రతిసారి తమ వద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరాలు లేవని పాక్ చెబుతూ వస్తుందని, అదంతా బూటకం అని, ఉగ్రవాద శిబిరాల వల్లే తమ జీవితాలు నరకంలో ఉన్నట్లుగా మారాయని వారంతా నినదించారు.
'ఉగ్రవాద సంస్థలను, ఉగ్రవాద శిక్షణ శిబిరాలను నిషేధించండి. మాకు భోజనం పెట్టండి, ఆహార పదార్థాలు అందించండి. మేం ఈ పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం' అంటూ వారంతా ఓ టీవీ చానెల్ కు తమ బాధను వెల్లబోసుకున్నారు. తాలిబన్ టెర్రర్ క్యాంపులు కూడా తమ వద్ద ఉన్నాయని, వాటిని నివారించకుంటే పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అన్నారు. 'ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడాన్ని ఆపనంతకాలం ఉగ్రవాదాన్ని అంతమొందించడం సాధ్యం కాదు' అంటూ ఆ ప్రాంత వాసులు కుండబద్ధలు కొట్టారు.