నిజంగానే కారు అద్దం పగిలింది

22 Nov, 2019 16:10 IST|Sakshi
పగిలిన టెస్లా కారు అద్దం

లాస్‌ ఏంజెల్స్‌ : ఎన్నో ప్రత్యేకతలతో ఉండే కార్లను జేమ్స్‌బాండ్‌ మూవీలో మనం తెరపైన చూసుంటాం. కానీ అలాంటి కార్లను వాడుకలోకి తీసుకురావాలని అమెరికాకు చెందిన టెస్లా మోటార్స్‌ కంపెనీ యోచించింది. అనుకున్నట్లుగానే టెస్లా ఎన్నో వెరైటీ కార్లను తయారు చేసింది. ఈ క్రమంలో లాస్‌ఏంజెల్స్‌లో కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఎలక్ట్రిక్‌ సాయంతో నడిచే ‘టెస్లా సైబర్‌ ట్రక్‌’ కారు నమూనాను ప్రదర్శనకు పెట్టారు. పగలని అద్దాలు దాని ప్రత్యేకత. ఎలాన్‌ మస్క్‌.. టెస్లా సైబర్‌ కారు ప్రత్యేకతల గురించి చెప్తూ చీఫ్‌ డిజైనర్‌ ఫ్రాంజ్‌ వాన్‌ హోల్జాసన్‌ను స్టేజిపైకి ఆహ్వానించి ఆ కారును పరీక్షించుకోమన్నారు. వెంటనే సదరు నిపుణుడు ఓ మెటల్‌ బాల్‌ను తీసుకుని కారు అద్దాలపైకి విసిరాడు. అనూహ్యంగా ఆ కారు అద్దం పగిలింది. ఈ ఊహించని పరిణామానికి ఎలాన్‌ మస్క్‌కు నోట మాట రాలేదు. కారు వెనకవైపు బాల్‌ను కాస్త నెమ్మదిగా విసిరినా అద్దం పగిలిపోయింది. దీంతో ఎలాన్‌ మస్క్‌ నిరాశ చెందారు.

ఈ ఘటనపై ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ.. ఎలక్ట్రిక్‌ కారును ప్రయోగదశలోనే అన్ని రకాలుగా పరీక్షలు నిర్వహించాము. కిచెన్‌లో ఉపయోగించే సింక్‌ను దీనిపైకి విసిరినా అద్దం పగల్లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకిలా జరిగిందో అర్థం కావట్లేదు. దీనికి గల కారణాలు తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 2021లో రోడ్లపైకి వచ్చే అవకాశమున్న టెస్లా సైబర్‌కారు ధర 39,900 డాలర్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీన్ని ఒక్కసారి చార్జ్‌ చేస్తే 500 మైళ్లకు పైగా ప్రయాణించవచ్చు.

మరిన్ని వార్తలు